Karnataka | బెంగళూరు, అక్టోబర్ 16 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నిధులు సమీకరించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వానికి అప్పగించిందా? ఇద్దరు ప్రభుత్వ పెద్దలు బాధ్యతలు పంచుకొని కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించారా? మూడు రోజులుగా కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ దాడుల్లో పట్టుబడిన కోట్లాది రూపాయలు వీరు సమీకరించినవేనా? అంటే అవుననే ఆరోపిస్తున్నాయి ఇక్కడి విపక్ష పార్టీలు. సాక్ష్యాత్తూ రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ విషయాన్ని నిర్ధారించడం విశేషం. ఇక్కడ పట్టుబడిన డబ్బు ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు తరలించడానికి సమీకరించినట్టు సమాచారం ఉందని కేంద్ర మంత్రి ఆరోపించడమే కాకుండా దీనిపై ఈడీ విచారణ జరిపితే అసలు దోషులు బయటికి వస్తారని అన్నారు.
పట్టుబడిన డబ్బులు ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు తరలించడానికి కాంగ్రెస్ సమీకరించినవేనని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆరోపించగా, మరో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరో అడుగు ముందుకేసి ఆ డబ్బు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమీకరించినవేనని ఆరోపించడం గమనార్హం. కేంద్ర మంత్రితోపాటు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు చేసిన ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలను డీకే శివకుమార్ ఖండించారు. ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. అయితే ‘రాజకీయ ప్రేరేపితమని డీకే శివకుమార్ బుకాయించడం కాదు…పట్టుబడిన డబ్బులు మీవో? కావో? చెప్పాలి’ అని కుమారస్వామి డిమాండ్ చేసారు.
కర్ణాటకలో పెద్ద మొత్తంలో ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు తరలించడానికి సంబంధించినవేనని కేంద్ర మంత్రితో సహ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఆరోపిస్తుండగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ‘అక్కడెక్కడో డబ్బులు పట్టుబడితే తమకేమి సంబంధం’ అని బుకాయించడం పట్ల ఇక్కడ విపక్ష నేతలు విస్తుపోతున్నారు. తెలంగాణ ఎన్నికలతో డీకే శివకుమార్కు సంబంధం లేకుంటే అక్కడి నుంచి టిక్కెట్లు ఆశించే నాయకులు, తన పార్టీ విలీనం కోసం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డీకేతో ఎందుకు భేటీ అయ్యారని వారు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు ఎందుకు తరలించినట్టు అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలంగాణలో అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యాక తన మకాం హైదరాబాద్లోనే అని ఆయన స్వయంగా పార్టీ నేతలకు చెప్పింది వాస్తవం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉండగా కర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్టర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్లు, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కాంతరాజ్కు సన్నిహితుడైన బిల్డర్ సంతోష్ ఇంట్లో రూ.45 కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా వీరంతా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితులని కేంద్ర మంత్రి, మాజీ సీఎంలు ఆరోపిస్తుండగా, రేవంత్రెడ్డి మాత్రం తమకేమి సంబంధం అని బుకాయించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో గత బీజేపీ సర్కార్ 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నదని పెద్దయెత్తున ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో తమ పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని కాంట్రాక్టర్లు, అధికారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. బెంగళూరు నగరపాలికలో పెండింగ్లో ఉన్న సుమారు రెండు వేల కోట్ల రూపాయాల బిల్లులను క్లియర్ చేయడానికి సంబంధిత మంత్రి అయిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఏకంగా రాష్ట్ర గవర్నర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తమకు నెలనెలా కప్పం చెల్లించాలని వేధిస్తున్నారని వ్యవసాయశాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడం తెలిసిందే. అధికారులకు, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు టార్గెట్ పెట్టి పెద్ద మొత్తంలో కర్ణాటక ప్రభుత్వం సమీకరించిన నిధులు కాంగ్రెస్ పార్టీకి ఖజానాగా మారాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
‘శివకుమార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తమ శాఖను తెరిచిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తీవ్ర ఆరోపణ చేసారు. కర్ణాటకలో శివకుమార్ డబ్బులు వసూలు చేసి ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు డబ్బులు పంపించే కాంగ్రెస్ ప్లాన్ బెంగళూరులో పట్టుబడిన డబ్బులతో బట్టబయలు అయిందన్నారు. సుపరిపాలన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పగటి దోపిడిలో మునిగిపోయిందని విజయేంధ్ర ధ్వజమెత్తారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు రాష్ర్టాల్లో మూడు రోజులుగా కాంట్రాక్టర్లు, బిల్డర్ల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడుల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు పట్టుబడిన విషయం తెలిసిందే. తమ దాడుల్లో మొత్తంగా రూ.102 కోట్లు పట్టుబడితే అందులో రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్ల ఆభరణాలు ఉన్నాయని ఐటీ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా పట్టుబడిన నగదులో ఒక్క బెంగళూరులోనే రూ.87 కోట్లు పట్టుబడటం గమనార్హం. దీంతో ఈ కోట్లాది రూపాయాల నిధుల సమీకరణలో కర్ణాటక సర్కార్లోని పెద్దతలల పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.