న్యూఢిల్లీ, ఆగస్టు 26: మధుమేహం సహా వివిధ రకాల వ్యాధుల చికిత్సకు వినియోగించే 45 రకాల ఔషధాల రిటైల్ ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సవరించింది. జాబితాలో మధుమేహ మందులతో పాటు రక్తపోటు, సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్లు, కంటికి సంబంధించినవి, అధిక కొలెస్ట్రాల్, ట్రైైగ్లెసెరైడ్ స్థాయిల చికిత్సకు వినియోగించే ఔషధాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగించే సిటాగ్లిప్టిన్+మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, లినాగ్లిప్టిన్+మెట్ఫామిన్ కాంబినేషన్ల ఔషధాల ఒక్కో ట్యాబ్లెట్ ధరను ఎన్పీపీఏ వరుసగా రూ.16-21, రూ.16-25 శ్రేణికి తీసుకువచ్చింది. సిటాగ్లిప్టిన్పై ‘మెర్క్షార్ప్ అండ్ డోమ్(ఎంఎస్డీ)’ పేటెంట్ హక్కులు గత నెలతో ముగిసింది. అదేవిధంగా లినాగ్లిప్టిన్+మెట్ఫామిన్పై ఉన్న పేటెంట్ హక్కుల కాలపరిమితి కూడా వచ్చే నెలలో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఈ మాత్రల ధరలను ఎన్పీపీఏ తగ్గించింది.
ఇంకా అలర్జీ, జలుబు వంటి వాటికి వినియోగించే పారాసెటమాల్, పినైల్ఫ్రైన్, హ్రైడోక్లోరైడ్, కెఫైన్ అండ్ డిఫెన్హైడ్రామెన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ ఔషధం ధరను రూ.3.73గా నిర్ణయించింది.
యాంటీబయాటిక్గా ఉపయోగించే అమోక్సిసిలిన్ అండ్ పొటాషియం క్లావులనేట్ ఓరల్ సస్పెన్షన్ సిరప్ ధరను రూ.163.43గా స్థిరీకరించింది. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్-2013 ప్రకారం తాజా ధరలను నిర్ణయించినట్టు ఎన్పీపీఏ నోటిఫికేషన్లో పేర్కొన్నది.