న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన ధృవ్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. లాఢక్లో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ధృవ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ తేలికైన హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు, మరో వ్యక్తి క్షేమంగా ఉన్నారని, వారికి స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. అయితే హెలికాప్టర్ అత్యవసరంగా ఎందుకు ల్యాండ్ అయ్యిందనే విషయం తెలియదని, ఎదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా అనే వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.