హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్లపై చర్చ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్దయెత్తున ధర్నా చేశారు. సేవ్ మణిపూర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. బీజేపీ ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వమే సుప్రీం అని, ప్రజాప్రభుత్వాన్ని కాదని, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. కేంద్ర వైఖరిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, దీవకొండ దామోదర్రావు, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాసరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, బండి పార్థసారధి రెడ్డి, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఉభయసభల్లో వాయిదాల పర్వం
అటు పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం కూడా వాయిదాల పర్వంలో నడిచాయి. మణిపూర్ అంశంపై తక్షణం చర్చ చేపట్టాల్సిందేనని లోక్సభ, రాజ్యసభలో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇన్స్టిట్యూట్ల నిర్వహణ జవాబుదారీతనాన్ని రాష్ట్రపతికి అప్పగించే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు-2023ను ప్రభుత్వం లోక్సభలో ఆమోదింపజేసుకొన్నది. ఈ బిల్లు ద్వారా ఐఐఎంలకు విజిటర్గా రాష్ట్రపతికి ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలపై సమీక్ష చేయడం, దర్యాప్తులకు ఆదేశించడం, డైరెక్టర్లను నియమించడం లేదా తొలగించడం వంటి అధికారాలు లభిస్తాయి.