అయోధ్య: అయోధ్య రామ మందిరం (Ayodhya) రాములోరి ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. బాల రామునికి (Ram Lalla) సంబంధించిన ఫొటోలను ఆయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. దీంతో యావత్ భారతదేశం భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నది. ఇక దేశ ప్రజలు రామునిపై తమ భక్తిని వివిధ మార్గాల్లో చాటుకుంటున్నారు. ఛత్తీస్గఢ్కు (Chhattisgarh) చెందిన 17 మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. రాములవారికి నైవేద్యంగా రేగిపండ్లు (Sweet Ber Fruit) సమర్పించారు. వాటిని రామ జన్మభూమి ట్రస్టుకు అందించారు.
ఛంపా జిల్లాలోని రాములవారి అమ్మమ్మ ఇళ్లుగా చెప్పుకునే శివ్రినారాయణ ప్రాంతం నుంచి రేగిపండ్లను తెచ్చినట్లు అనూప్ యాదవ్ అనే భక్తుడు తెలిపారు. అదేవిధంగా అక్కడ లభించే ప్రత్యేక మొక్కను కూడా తీసుకొచ్చామని వెల్లడించారు. ఆ చెట్టు ఆకులు గిన్నె ఆకారంలో ఉంటాయన్నారు. వనవాసంలో భాగంగా సోదరుడు లక్షణుడితోపాటు శివ్రినారాయణ ప్రాంతానికి వచ్చిన శ్రీరామునికి.. ఆ ఆకుల్లోనే శబరి తాను సంగం తిన్న రేగిపండ్లను ఇచ్చారని ప్రతీతి అన్నారు. అందువల్ల ఈ మొక్కను గుడి ఆవరణలో నాటాలని ఆలయ కమిటీని కోరినట్లు చెప్పారు.