న్యూఢిల్లీ: విధ్వంసక శక్తులు కొంతకాలం మాత్రమే ఆధిపత్యం చెలాయించగలవని, శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించే సిద్ధాంతాన్ని అనుసరించే వారు మానవత్వాన్ని శాశ్వతంగా అణచివేయలేరని చెప్పారు. గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయాన్ని గతంలో ధ్వంసం చేసినప్పుడు ఇది నిజమైందని, ఇప్పుడు కూడా నిజమవుతుందని అన్నారు. శుక్రవారం సోమ్నాథ్ ఆలయంలోని పలు ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుని మళ్లీ అరాచకాలకు పాల్పడుతుండటంపై మోదీ తొలిసారి ఇలా స్పందించారు.
‘విధ్వంసం కోసం ప్రయత్నించే శక్తులు, భీభత్సంతో సామ్రాజ్యాలను సృష్టించే సిద్ధాంతాన్ని అనుసరించే వారు కొంతకాలం ఆధిపత్యం చెలాయించవచ్చు. కానీ వారు మానవత్వాన్ని శాశ్వతంగా అణచివేయలేరు. కాబట్టి వారి ఉనికి ఎప్పటికీ శాశ్వతం కాదు’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘సోమనాథ్ దేవాలయాన్ని చాలాసార్లు ధ్వంసం చేశారు. విగ్రహాలను అనేక సార్లు అపవిత్రం చేశారు. ఆలయం ఉనికిని తుడిచిపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ప్రతి విధ్వంసక దాడి తర్వాత ఆలయం పూర్తి వైభవాన్ని సంతరించుకున్నది. మనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు.