ఐజ్వాల్, నవంబర్ 16: మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మార్చడానికి ఎన్నికల సంఘం(ఈసీ) తిరస్కరించింది. ఓట్ల లెక్కింపును యథా ప్రకారం డిసెంబర్ 3వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఈ నెలలో వివిధ తేదీలలో నిర్వహిస్తున్నప్పటికీ ఓట్ల లెక్కింపును మాత్రం డిసెంబర్ 3న చేపడతామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే డిసెంబర్ 3న ఆదివారం కాబట్టి క్రైస్తవులు అధికంగా ఉండే మిజోరంలో ప్రజలు ఆ రోజు చర్చిలకు వెళతారు కాబట్టి కౌంటింగ్ను మరో రోజుకు మార్చాలంటూ పలు పార్టీలు, పౌర సంఘాలు, సంస్థలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించానని, అయితే వారు యథా ప్రకారం డిసెంబర్ 3నే కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించినట్టు మిజోరం ప్రధాన ఎన్నికల అధికారి మధ్యూప్ వ్యాస్ గురువారం తెలిపారు. పోలింగ్లా కౌంటింగ్ ప్రక్రియలో ప్రజలు పాల్గొనరని, వారు ఆ రోజు యథావిధిగా తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు కాబట్టి ఓట్ల లెక్కింపు తేదీని ఈసీ మార్చలేదని వ్యాస్ చెప్పారు.