ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతను మార్చాలన్న శివసేన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అంగీకరించారు. ఏక్నాథ్ షిండే పలువురు శివసేన ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో ఆయనను లెజిస్లేచర్ పార్టీ నేతగా శివసేన తొలగించింది.
సీఎం ఉద్ధవ్ ఠాక్రేను వ్యతిరేకిస్తూ ఏక్నాథ్ షిండే తనకు మద్దతిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహిస్తున్న క్రమంలో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఎన్సీపీ, కాంగ్రెస్ల నుంచి వైదొలగి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని షిండే శివసేన నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇక పార్టీ శాసనసభా పక్ష నేత మార్పు గురించి 22 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖపై డిప్యూటీ స్పీకర్ స్పందించారు.
సేన ఎమ్మెల్యేల విజ్ఞప్తిని తాను ఆమోదించానని, చట్ట ప్రకారం లెజిస్లేచర్ పార్టీ నేతను పార్టీ నాయకుడు నియమిస్తారని, ఈ దిశగా లెజిస్లేచర్ పార్టీ నేతను మార్చుకునే హక్కు వారికి ఉంటుందని నరహరి జిర్వాల్ స్పష్టం చేశారు. లెజిస్లేచర్ పార్టీ నేత మార్పు మినహా ప్రస్తుతం గువహటి క్యాంప్లో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల గురించి శివసేన నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని పేర్కొన్నారు. మరోవైపు బుధవారం జరిగే పార్టీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని శివసేన నేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రెబెల్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు.