Maharashtra | ముంబై, సెప్టెంబర్ 4: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ ఊపందుకొన్నది. మూడు రోజుల క్రితం జాల్నా జిల్లాలో పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పుణె జిల్లాలోని బారామతి పట్టణంలో వివిధ మరాఠా సంఘాలు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. స్థానిక ఎన్సీపీ ఎమ్మెల్యే, ఇటీవల ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై లాఠీచార్జిని తీవ్రంగా నిరసిస్తూ బీజేపీ-షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఔరంగాబాద్, హింగోలి, సతారా, నాందేడ్లలో బంద్ పాటించారు. చత్రపతి శంభాజీ నగర్లో ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించారు. కల్యాణ్ పట్టణంలో దుకాణాలను మూసివేశారు. పుణేలో ప్రతిపక్ష శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ పవార్ గ్రూపు), కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. మరాఠీల సహనాన్ని పరీక్షించొద్దని ప్రభుత్వానికి నేతలు హితవు పలికారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్లు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని గత నెల 29 నుంచి జాల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలో మనోజ్ జరాంగే నేతృత్వంలో నిరాహార దీక్ష కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులపై లాఠీచార్జిని నిరసిస్తూ ఆదివారం కూడా మహారాష్ట్రలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. లాఠీచార్జిని తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ రాస్తారోకోలు చేశారు. ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్దయెత్తున నిరనసకారులు రోడ్లపైకి వచ్చారు. అకోలా పట్టణంలో కారులో వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భువాంకులేకు ఆందోళనకారులు నల్లజెండాలు చూపారు.
లాఠీచార్జిలో గాయపడిన ఆందోళనకారులను ఎన్సీపీ నేత శరద్ పవార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పై నుంచి(ప్రభుత్వ పెద్దల)’ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఆందోళన కార్యక్రమం ప్రశాంతంగా సాగిందని, అయితే ఆ తర్వాతే పోలీసులు రెచ్చిపోయారని, ఆందోళనకారులపై లాఠీ దెబ్బల వర్షం కురిపించారని, టియర్గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. తద్వారా పరిస్థితి మరింత తీవ్రతరమైందని పేర్కొన్నారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడా సోమవారం జాల్నాలో ఆందోళనకారులను కలిశారు.
లాఠీచార్జి ఘటనపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా లాఠీచార్జి జరిగిందని, సీఎం, డిప్యూటీ సీఎం కార్యాలయాల నుంచి స్థానిక పోలీసులకు ఫొన్ చేసి లాఠీచార్జి ఆదేశాలు ఇచ్చారని, ఆ అదృశ్య శక్తులు ఏవో తెలుసుకోవాలని అనుకొంటున్నామని అన్నారు. సీఎం షిండే, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్లు జనరల్ డయ్యర్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై లాఠీచార్జికి ఆదేశాలు ఇచ్చారని జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని ఉద్దేశించి రౌత్ వ్యాఖ్యానించారు. కాగా, లాఠీచార్జి నేపథ్యంలో సీఎం షిండే జాల్నా ఎస్పీ తుషార్ను సెలవుపై పంపించారు. అదేవిధంగా ఇద్దరు డీఎస్పీ ర్యాంకు అధికారులను ఇతర జిల్లాకు బదిలీ చేశారు.మరాఠా రిజర్వేషన్ల అంశంపై నిపుణులతో ఒక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు సీఎం షిండే సోమవారం వెల్లడించారు.
కాగా, వచ్చే ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై అధికార బీజేపీ, శివసేన(షిండే వర్గం) కలవరపడుతున్నాయి. మరాఠా రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల్లో ఎక్కడ దెబ్బకొడతాయోనని ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను చల్లార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా జాల్నా ఘటన దురదృష్టకరమని, ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జికి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సోమవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జాల్నా ఘటనపై సీఎం షిండే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారని తెలిపారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. మనోజ్ జరాంగే తన నిరాహార దీక్ష విరమించాలని కోరారు.
నిరాహార దీక్షను విరపింపజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ తిరస్కరించారు. మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంలోగా ప్రకటన చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే అంతకంటే ముందు రిజర్వేషన్లపై తీర్మానం లేదా ఉత్వర్వులతో ప్రభుత్వ బృందం తమకు వద్దకు రావాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే బుధవారం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. మంగళవారం నుంచి నీరు తాగడం కూడా ఆపేస్తానని తెలిపారు. ఆదివారం రాత్రి మంత్రి గిరీశ్ మహాజన్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం మనోజ్ జరాంగేను కలిసింది. సమస్యను పరిష్కరించేందుకు నెల సమయం ఇవ్వాలని కోరారు. సోమవారం సీఎం షిండే తరపున శివసేన నేత అర్జున్ కొట్కార్ కలిశారు. రిజర్వేషన్ల అంశంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.