Dengue | న్యూఢిల్లీ, మే 2: భారత్ను డెంగ్యూ వైరస్ కలవరపెడుతున్నది. గత దశాబ్దకాలంగా డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అధ్యయనంలో తేలింది. డెంగ్యూకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని అధ్యయనం నొక్కిచెప్పింది.
గత 50 ఏండ్లుగా ఆగ్నేయాసియా దేశాల్లో డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఈ వైరస్కు వ్యతిరేకంగా పనిచేసే టీకాలు అభివృద్ధి చేసినప్పటికీ.. ఇండియాలో మాత్రం ఇప్పటివరకూ దీనికి వ్యాక్సిన్స్ లేవు.
‘ఇండియన్ డెంగ్యూ వేరియంట్స్ అసలైన వైరస్ జాతినుంచి చాలా విభిన్నంగా ఉన్నట్టు కనుగొన్నాం’ అని ఐఐఎస్సీ అసోసియేట్ ప్రొఫెసర్ రాహుల్ రాయ్ తెలిపారు. వ్యాక్సిన్ కనుగొనేందుకు తమ అధ్యయనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.