Dengue | కోల్కతా, సెప్టెంబర్ 20: వర్టికల్ ట్రాన్స్మిషన్ ద్వారా నవజాత శిశువుకు తల్లి నుంచి డెంగ్యూ వ్యాధి సోకిన అతి అరుదైన ఘటన కోల్కతాలో చోటుచేసుకుంది. తల్లి నుంచి వచ్చే స్రవాలు (పాలు పట్టడం, ఇతర మార్గాలు) ద్వారా బిడ్డకు వైరస్, ఇన్ఫెక్షన్ సోకడాన్నే వైద్య పరిభాషలో వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. ఇది దోమలలో సాధారణమని, అయితే మనుషుల్లో అతి అరుదుగా జరుగుతుందని సంక్రమిత వ్యాధుల నిపుణులు తెలిపారు. కోల్కతా లేక్ టౌన్కు చెందిన 29 ఏండ్ల నిండు గర్భవతి సెప్టెంబర్ 9న డెంగ్యూ జ్వరంతో చర్నాక్ దవాఖానలో చేరింది. అప్పటికే ఆమె ప్లేట్లెట్ల కౌంట్ 40 వేలు ఉంది.
చేరిన నాలుగో రోజున ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం చేసిన డాక్టర్లు తర్వాత రొటీన్ రక్త పరీక్షలలో ఆమెకు డెంగ్యూ ఇంకా ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో పుట్టిన బిడ్డకు కూడా పరీక్షలు నిర్వహించగా ఆ శిశువుకు కూడా డెంగ్యూ ఉన్నట్టు తేలింది. దీంతో బిడ్డకు కొద్ది రోజుల పాటు ఐవీ థెరపీ చేయడంతో కోలుకుంది. తల్లీబిడ్డలిద్దరూ ఆ వ్యాధి నుంచి బయటపడటంతో వారిని డిశ్చార్జి చేశారు. గర్భంతో ఉన్న మహిళ అతి అరుదైన సందర్భాలలో మాత్రమే తల్లి ప్లాసెంటా నుంచి కడుపులోని పిండానికి ప్రసవానికి ముందు గానీ, ప్రసవ సమయంలో కాని, ప్రసవమైన వెంటనే కానీ సోకే అవకాశం ఉందని, ఈ కేసులో అదే మాదిరిగా తల్లి నుంచి బిడ్డకు డెంగ్యూ వ్యాధి సోకి ఉండవచ్చునని వైద్య నిపుణులు తెలిపారు.