BRS | హైదరాబాద్, జూన్ 15 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): సోలాపూర్ వాసులు ఏండ్లుగా కంటున్న కల సాకారమైంది. విమాన సర్వీసులకు అడ్డుగా ఉన్న సిద్ధేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ చిమ్నీని అధికారులు ఎట్టకేలకు పడగొట్టారు. అక్రమంగా నిర్మించిన చిమ్నీని పడగొట్టాలంటూ తొమ్మిదేండ్లుగా అటు ప్రజలు, ఇటు హక్కుల కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఫలితం లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఆ బాధ్యతను తీసుకొన్నారు. చిమ్నీని కూల్చి విమాన సేవలు ప్రారంభించాలంటూ ప్రజాక్షేత్రంలో జనాందోళన నిర్వహించారు. దీంతో ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం బుధవారం చిమ్నీ కూల్చివేతను ప్రారంభించి గురువారానికి పూర్తి చేసింది. చిమ్నీ వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయాయంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు జనాందోళన చేపట్టాలని ఆదేశించారని, ఈ క్రమంలోనే తాము ఆందోళనను ఉధృతం చేశామని మహారాష్ట్ర బీఆర్ఎస్ సమన్వయకర్త జేకే దేశ్ముఖ్ వెల్లడించారు.
ఎయిర్పోర్టుకు సమీపంలోని సిద్ధేశ్వర్ ఫ్యాక్టరీ 2014లో 92 మీటర్ల ఎత్తులో పొడవాటి చిమ్నీని అక్రమంగా నిర్మించింది. విమానాలకు చిమ్నీ అడ్డుగా ఉండటం, తరుచూ పొగ వస్తుండటంతో చాలాకాలం క్రితమే సోలాపూర్లో విమాన సేవలను నిలిపివేశారు. చిమ్నీని కూలగొట్టాలంటూ సోలాపూర్ డెవలప్మెంట్ ఫోరంతో పాటు పౌరులు కొంతకాలంగా విజ్ఞప్తులు చేస్తున్నారు. స్థానిక రాజకీయ నేతలు కొందరు ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని, అందుకే చిమ్నీ తొలగింపు ప్రక్రియ ముందుకు జరుగలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో పార్టీని విస్తరించిన కేసీఆర్.. చిమ్నీ తొలగింపుతోనే సోలాపూర్కు విమాన సేవలు వస్తాయని, అప్పుడే పట్టణాభివృద్ధి సాధ్యమని గుర్తించి, ఆ దిశగా స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే సోలాపూర్ డెవలప్మెంట్ ఫోరంతో కలిసి బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.