అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. ఆపదలో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టే వారే నిజమైన ఆత్మీయులంటారు. కరోనా కష్టకాలంలో అమ్మలా ఆత్మీయతను పంచుతూ..కమ్మని భోజనాన్ని కడుపునిండా పెడుతున్నది తెలంగాణ సర్కారు. లాక్డౌన్ వేళ.. అన్నార్తుల ఆకలి తీరుస్తున్నది. జీహెచ్ఎంసీ, హరే కృష్ట మూవ్మెంట్ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లు పేదల పాలిట ‘అక్షయపాత్ర’గా మారాయి. ఆపత్కాలంలో పేదలు పస్తులుండకుండా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఉచితంగా భోజనాలు అందిస్తున్నాయి. 250 కేంద్రాల్లో రోజుకు 60 వేల మంది రెండు పూటలా భోజనం చేస్తున్నారు. రుచి, శుచి.. సమతుల పోషకాలతో ఆహారాన్ని అందిస్తుండడంతో వలస కార్మికులు, విద్యార్థులు, బ్యాచిలర్లు, చిరుద్యోగులు సర్కారుకు చేతులెత్తి మొక్కుతున్నారు.
కమ్మటి భోజనంతో కడుపు నింపుతున్నారు.. ఆకలి తీరిన నిరుపేదలు చెబుతున్న మాటలివి. ఆకలి బాధలు లేకుండా చక్కగా తిని శ్రద్ధగా చదువుకోగలుగుతున్నామని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు బ్యాచిలర్స్.. ఇంటి భోజనం మరిపిస్తుందంటూ మరికొందరు.. ఇలా అన్నపూర్ణ భోజనాలకు అన్నార్తుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. లాక్డౌన్ వేళ ఏ ఒక్కరూ
పస్తులుండకుండా కడుపు నిండా చక్కటి భోజనాన్ని ఉచితంగా అందిస్తున్న జీహెచ్ఎంసీ సేవలను ప్రతిఒక్కరూ కొనియాడుతున్నారు.
సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ వేళ ఎంతోమంది అభాగ్యులకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తోంది. ప్రతినిత్యం రెండు పూటలా వేలాది మంది నిరాశ్రయులకు కడుపు నింపుతూ ‘అమ్మ’ పాత్ర పొషిస్తున్నది.. నిరుపేదలు పస్తులుండకుండా వారి కడుపు నింపాలన్న లక్ష్యంగా నగరవ్యాప్తంగా 250 అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆకలి తీర్చుతున్నది. ఇంటిని మరిపించే భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నది. హరేకృష్ణతో కలిసి జీహెచ్ఎంసీ ప్రతిరోజూ సరాసరిగా 60 వేల మందికి పైగా భోజనాలు అందిస్తున్నది. నిరాశ్రయుల నుంచి బ్యాచిలర్ వరకు, పేద, మధ్య తరగతి అన్న తేడా లేకుండా అనేక మంది అన్నపూర్ణ భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. కాగా నిత్యం జీహెచ్ఎంసీ లక్షలాది రూపాయల భారాన్ని భరిస్తూ నిరుపేదలకు ఉచితంగా అందిస్తుండడం గమనార్హం.
ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న సదుద్దేశంతో శ్రీకారం చుట్టిన ‘అన్నపూర్ణ’ కేంద్రాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో హైదరాబాద్లోని నిరాశ్రయులు, చిరు వ్యాపారులు, పేదవారికి అన్నపూర్ణ సెంటర్ల ద్వారా అందించే ఐదు రూపాయల భోజనాన్ని ఉచితంగా అందివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గత మంగళవారం నుంచి 250 సెంటర్ల ద్వారా ఉచితంగా భోజనాన్ని అందిస్తూ వస్తున్నారు అధికారులు. మరోవైపు అన్నపూర్ణ కేంద్రాలు శుచి, శుభ్రత, రుచికరమైన భోజనానికి పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి.
చిన్న చిన్న పార్టీలు, శుభకార్యాలకు 100 కిలోల ఫుడ్ తయారు చేయాలంటేనే ఎంతో శ్రమ పడాలి. అలాంటిది రోజూ 70 వేల మందికి భోజనాలు తయారు చేసేందుకు హరేకృష్ణ మూవ్మెంట్ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిత్యం టన్నుల కొద్దీ ఆహారాన్ని సమయానికి వండుతున్నారు. ఉదయం నాలుగు గంటలకు వంట మొదలు పెట్టి తొమ్మిది గంటలకు పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత అన్నపూర్ణ సెంటర్లకు పంపిణీ చేస్తున్నారు. నార్సింగి కేంద్రంలో ప్రతిరోజు 70 వేల మందికి భోజనాలు తయారు చేస్తున్నారు. ఇందుకోసం 6,500 కిలోల రైస్, 1400 కేజీలు పప్పు, 5 వేల కిలోల కూరగాయలు, నాలుగు వేల కిలోల పెరుగు, 400 కిలోల మిర్చి వాడుతున్నారు. మొత్తం ఫుడ్ తయారీకి ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ నుంచి, కిచెన్ హెల్పర్స్, డ్రైవర్స్, సూపర్ వైజర్లు ఇలా దాదాపు 300 మంది శ్రమిస్తున్నారు. మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, కమిషనర్ లోకేశ్కుమార్ మార్గదర్శనంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సంతోశ్ పర్యవేక్షణలో అన్నపూర్ణ సెంటర్ల ద్వారా అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు.
రెజిమెంటల్ బజార్లో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రం వద్ద నిత్యం సుమారు 400 మందికి ఆహారం అందిస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ కేంద్రం ఉండటంతో యాచకులు, వలస కూలీలు, నిరుపేదలు ఇక్కడికి వచ్చి ఆకలి తీర్చుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తూనే ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. – దామోదర్, అన్నపూర్ణ కేంద్రం నిర్వాహకుడు
కొవిడ్ నేపథ్యంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేయడం అభినందనీయం. లాక్డౌన్ సందర్భంగా బడుగు బలహీనులకు సరైన పోషకాహారం అందించేందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి చర్యలు తీసుకోవడం అభినందనీయం. కష్టకాలంలో సమయానికి పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. -రాములమ్మ, కార్మికురాలు
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి నాది. లాక్డౌన్కు ముందు ఎక్కడో ఒక దగ్గర పని చేసుకుంటూ జీవనం సాగించేవాడిని. ప్రస్తుతం కార్పెంటర్ పని దొరకడం లేదు. అన్నపూర్ణ కేంద్రంలో ప్రతిరోజూ ఉచితంగా రుచికర భోజనం అందిస్తున్నారు. నేను అక్కడే తింటున్నా. ఇంత మంచి పని చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.-శ్రీనాథ్, కార్పెంటర్, మల్కాజిగిరి
పని పూర్తి అయ్యే వరకు మధ్యాహ్నం అవుతుంది. అప్పటికే చిలకలగూడ బస్టాప్ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజన కేంద్రం తెరిచి ఉంటుంది. అక్కడే వేడివేడి భోజనం దొరుకుతుంది. తెల్లవారు జామునే విధులకు వస్తుండటంతో ఇంట్లో వంట చేసుకునేందుకు సమయం దొరకడం లేదు. ప్రతిరోజు అదే కేంద్రంలో పోషకాహారం తింటున్నా. – మల్లమ్మ, పారిశుధ్య కార్మికురాలు
అభాగ్యుల ఆకలి తీర్చడంలో అన్నపూర్ణ మేటిగా నిలుస్తున్నది. లాక్డౌన్ కాలంలో బయట మంచినీరు దొరకని పరిస్థితి. రోడ్లపై సేదతీరే ఎందరో అభాగ్యులకు అన్నపూర్ణ ఆకలిదప్పికలు తీరుస్తున్నది. కష్టకాలంలో ఎందరికో కడుపు నిండుతున్న ప్రభుత్వం సేవలు మరువలేనివి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నారు. – కుశాల్, సూపర్మార్కెట్ ఉద్యోగి
అన్నపూర్ణ కేంద్రాలతో మాలాంటి వారు ఎందరో కడుపులు నింపుకుంటున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగంతో కొన్నిసార్లు వరుసగా రెండుసార్లు షిఫ్ట్లు వచ్చినప్పటికీ అన్నం కోసం ఆందోళన చెందకుండా నిశ్చితంగా ఉద్యోగం చేస్తున్నాం. ఇంట్లో వండినట్టే ఈ కేంద్రాల్లో భోజనం రుచిగా ఉంటుంది. ఎంతో మంది పేదల కడుపు నింపుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుండటం ఆనందంగా ఉంది. -రమేశ్, ప్రైవేట్ సెక్యూరిటీ
లాక్డౌన్లో మాలాంటి పేదోళ్ల ఆకలి తీరుస్తున్న సీఎం కేసీఆర్ సార్ సల్లంగుండాలి. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటలకే వేడి వేడి భోజనం పెడుతున్నారు. కష్టకాలంలో సర్కార్ మంచి నిర్ణయం తీసుకుంది. నాలాంటి వాళ్లు ఎందరో ఈ కేంద్రం ద్వారా కడుపు నింపుకుంటున్నారు. -చంద్రయ్య, లారీ డ్రైవర్
ఇండ్లల్లో పని చేస్తే అక్కడే భోజనం పెట్టేవారు. ప్రస్తుతం కరోనాతో ఎవరూ పనికి రానివ్వడం లేదు. పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అన్నపూర్ణ కేంద్రంలో పెడుతున్న ఉచిత భోజనాన్ని తింటూ ఆకలి తీర్చుకుంటున్నాం. మాలాంటి పేదవారి కడుపుతున్న నింపుతున్న ప్రభుత్వ రుణం తీర్చుకుంటాం. -రాములమ్మ, కేపీహెచ్బీ కాలనీ
లాక్డౌన్ నేపథ్యంలో క్లీనర్ పని దొరకడం లేదు. ఒక రోజు పని చేస్తే మరొక రోజు ఖాళీ. తిండికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. తెలిసిన వ్యక్తి ఇక్కడ ఉచిత భోజనం పెడుతారంటే వచ్చా. అన్నం రుచిగా ఉంది. పని ఉన్నా లేకున్నా ఇక ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడికి వస్తున్నా. ఆకలి తీర్చుకుంటున్నా. నాలాంటి వారికి అన్నపూర్ణ కేంద్రాలు ఎంతో మేలు చేస్తున్నాయి. -సంతోశ్, లారీ క్లీనర్
చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయితే లాక్డౌన్తో ఆ పనులూ దొరకడం లేదు. ఇక అన్నపూర్ణ సెంటరే దిక్కైంది. అక్కడే ప్రతిరోజు భోజనం తింటున్నా. ఇంటికి పార్సిల్ తీసుకువెళ్తున్న. – కృష్ణ, కార్మికుడు, ముషీరాబాద్
అన్నపూర్ణ కేంద్రాలు లేకపోతే పస్తులు ఉండాల్సి వచ్చేది. గత లాక్డౌన్లో అనేక మంది ఆహారం పంపిణీ చేశారు. ప్రస్తుతం ఎవరూ ఆ పని చేయడం లేదు. నాలాంటి ఎందరికో అన్నపూర్ణ కల్పతరువుగా మారింది. ప్రతిరోజు ఇక్కడే వేడివేడి భోజనం తింటున్నా. ఉచితంగానే ఇస్తున్న ఈ భోజనం ఎంతో రుచిగా ఉంటున్నది. -రషీద్
శ్రీరామచంద్రుడి పాలనలా సీఎం కేసీఆర్ సుపరిపాలన సాగిస్తున్నారు. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా పేదలకు ఉచిత భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఆయన పేదల పక్షపాతి. -బాబూరావు, మలక్పేట
అన్నపూర్ణ కేంద్రాల్లో చాలా మంది ఇష్టంగా భోజనాలు చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి అందరికి ఉచితంగానే భోజనం పెడుతున్నాం. గతంలో ఐదు రూపాయలు వసూలు చేసేవారం. ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు భోజనం కేంద్రానికి చేరుతుంది. అప్పటినుంచి 1.30 వరకు భోజనాలు పెడుతున్నాం. అన్నంతో పాటు సాంబార్, చట్నీ, కూర, స్వీట్ ఇస్తున్నాం. ప్రతిరోజూ మెనూ మారుతుంది. బాలాపూర్ చౌరస్తాలోని అన్నపూర్ణ కేంద్రంలో ప్రతిరోజు 60 నుంచి 65 మంది భోజనం చేస్తున్నారు. -విజయ్కుమార్, అన్నపూర్ణ క్యాంటీన్ ఇన్చార్జి, బాలాపూర్
మా బంధువును ఆస్పత్రిలో చేర్పించా. చికిత్స పూర్తయ్యేవరకు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. హోటల్లో తిందామంటే.. లాక్డౌన్ వల్ల మూసి ఉన్నాయి. మాలాంటి వాళ్లకు అన్నపూర్ణ కేంద్రాలు ఆసరా అవుతున్నాయి. ఉచితంగా భోజనం పెడుతున్న తెలంగాణ సర్కారుకు చేతులెత్తి మొక్కుతున్నా. -రామయ్య, పశ్చిమ గోదావరి జిల్లా
నాకంటూ ఇల్లు లేదు. గచ్చిబౌలి ైఫ్లైఓవర్ కింద తలదాచుకుంటున్నా. ఆకలి అయ్యిందంటే చాలు.. రోజూ అన్నపూర్ణ క్యాంటీన్లో కడుపునిండా భోజనం చేస్తా. నాలాంటి వాళ్లు ఎందరో ఇక్కడ ఆకలి తీర్చుకుంటున్నారు. లాక్డౌన్ వల్ల మాకు అన్నం ఎక్కడ దొరుకుతుంది. ఎవరు పెడుతారు. దిక్కూమొక్కూ లేనివాళ్లు, రోజు కూలీ పని చేసుకునేటోళ్లకు పట్టెడన్నం దొరుకుతున్నదంటే.. అది సర్కారు గొప్పతనమే. -ఖాజాపాషా, గచ్చిబౌలి.