ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో తమ వర్గానికి రక్షణ కరువైందని, తమకు ప్రత్యేక పరిపాలనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర గిరిజన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అధికార బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన 10 మంది చిన్కుకి మిజో జోమి గిరిజన తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఈ మేరకు శనివారం కేంద్రానికి విన్నవించారు.
వీరిలో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాగా, ఇద్దరు కుకి పీపుల్స్ అలయెన్స్ పార్టీకి చెందినవారు, మరొకరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అల్లర్లలో ప్రభుత్వం తమ వర్గానికి చెందిన ప్రజలకు రక్షణ కల్పించలేదని వారు వాపోయారు. రాష్ట్రంలో మే 3 నుంచి అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. మైతీ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉందని వారు ఆరోపించారు. గిరిజనులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం
మణిపూర్లో జరిగిన అల్లర్ల తాలూకు చేదు జ్ఞాపకాలు అక్కడివారిని ఇంకా వెంటాడుతున్నాయి. ఇండ్లు, జీవనోపాధి కోల్పోయి ఇంఫాల్, చురచాంద్పూర్ తదితర ప్రాంతాల వాసులు రోడ్డున పడ్డారు. అనేకమంది ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో తిండి దొరక్క ఇబ్బంది పడుతున్నారు.