న్యూఢిల్లీ, జూలై 3: ఈనెల 20 నుండి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర రాజకీయ పోరు నెలకొనే అవకాశం ఉంది. నాలుగు వారాల పాటు జరిగే ఈ సమావేశాల్లో 19 సిట్టింగ్లు(సమావేశ రోజులు) ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనేక ప్రాంతీయ పార్టీలలో రాజకీయ సమీకరణాలు మారుతుండటం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు దూకుడుగా సిద్ధమవుతుండడంతో ఈ సమావేశాలు అత్యంత వాడీవేడిగా సాగే అవకాశం ఉంది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందే శివసేన(షిండే వర్గం)లో చేరిన ఆరుగురు శివసేన(యూబీటీ) ఎంపీలు, 20 మంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల విలీనానికి సంబంధించిన అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే, లోక్సభలో ఈ తిరుగుబాటు ఎంపీల సీట్ల కేటాయింపుపై కూడా నిర్ణయం వెలువడవచ్చు. మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమావేశాల సందర్భంగా రెండు రాజ్యాంగ సవరణ బిల్లులతోసహా పలు కీలక బిల్లులను ఆమోదింపచేయడానికి సన్నద్ధమవుతున్నది. మహిళల రిజర్వేషన్పై 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రతిపాదిత సవరణలతో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సవరించిన బిల్లులో లోక్సభ, రాష్ట్ర శాసనసభల సంఖ్యా బలాన్ని 50% పెంచే నిబంధన ఉండవచ్చని తెలుస్తున్నది. 30 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్న పక్షంలో ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలన్న నిబంధనను కూడా 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించే అవకాశం ఉంది.
ఈ నిబంధన దుర్వినియోగం కాకుండా కొన్ని రక్షణ, ముందు జాగ్రత్త చర్యలను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఒక దేశం, ఒక ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన కమిటీ కాలపరిమితిని పొడిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని తెలుస్తున్నది. ఈసీఆర్ఏకు సంబంధించిన వివాదాస్పద చట్టానికి చెందిన అంశం కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నది. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్, డోపింగ్ వ్యతిరేక సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, కార్పొరేట్ చట్టాల సంస్కరణలు, సెక్యూరిటీల మార్కెట్ కోడ్ వంటి అంశాలను కూడా ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కాగా, లోటు వర్షపాతం, కరవు, వరదలు, నీట్ ప్రశ్నపత్రం లీక్, అయోధ్య రామాలయ కానుకలు, విరాళాల చోరీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగితపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రతిపక్షం సన్నద్ధమవుతున్నది. అంతేగాక ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు చెందిన సమస్యలు, ప్రాంతీయ పార్టీలలో అంతర్గతంగా జరుగుతున్న చీలికలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై కూడా విపక్షాలు పార్లమెంట్లో గళం విప్పవచ్చు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఇటీవల సాధించిన ఎన్నికల విజయాల నేపథ్యంలో వర్షాకాల సమావేశాల్లో బీజేపీ దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే వివిధ రాష్ర్టాల్లో విపక్ష ఎమ్మెల్యేలతో అధికార పక్షం సాగిస్తున్న బేరసారాల అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.