న్యూఢిల్లీ: ఈ నెల 19న ఢిల్లీలో జరగబోయే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను పెద్దల సభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంజయ్సింగ్, ఎన్డీ గుప్తాలకు మరోసారి అవకాశం కల్పించింది.
ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా హర్యానా ఎన్నికలపై ఆసక్తి చూపడంతో ఆయన స్థానంలో స్వాతి మలివాల్ను ఎంపిక చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వాతి మలివాల్ మహిళలపై హింస, వివక్షపై అనేక ప్రచారాలు, ఉద్యమాలు చేశారు. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సంజయ్సింగ్ను రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసేందుకు కోర్టు అనుమతించింది.