జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్
కప్పర్ల, హస్నాపూర్ గ్రామాల్లో పనుల పరిశీలన
తాంసి, జూలై 9: పరిసరాల శుభ్రత కోసమే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపడుతుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని కప్పర్ల, హస్నాపూర్ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, అంతర్గత రోడ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నందున ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో సుధీర్రెడ్డి, సర్పంచ్లు సదానందం, నర్సింగ్, పంచాయతీ కార్యదర్శులు హమీద్, శ్రీలేఖ, గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్లో హరితహారం
తాంసి, జూలై 9: హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో సర్పంచ్ కృష్ణ మొక్కలు నాటారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ పడిగెల వసంత్, పంచాయతీ కార్యదర్శి గంగన్న, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి అందరి బాధ్యత
భీంపూర్, జూలై 9: గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పల్లె ప్రకృతివనం, నర్సరీ, శ్మశాన వాటిక, రైతు వేదికను ఆయన పరిశీలించారు. గ్రామంలో మురుగు కాలువల తీరు చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ సిబ్బంది నిరంతరం క్లోరినేషన్ చేపట్టాలన్నారు. చెత్త కోసం డంప్యార్డులు వినియోగించుకోవాలని సూచించారు. పరిశుభ్రతకు సహకరించని వారికి జరిమానా విధించాలన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ లింబాజీ, ఉపసర్పంచ్ రవీందర్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు రాథోడ్ ఉత్తమ్, పంచాయతీ కార్యదర్శి సాయినందన ఉన్నారు.
పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కారం
బోథ్, జూలై 9: పల్లె ప్రగతితో గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని నక్కలవాడ, మర్లపల్లి, బాబెరతండాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కింద ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామాల్లోని సమస్యలు ఎప్పటికప్పుడు సర్పంచ్లు తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సీహెచ్ రాధ, ఎంపీటీసీలు జగదిరావు, మణిందర్సింగ్, మహిపాల్, రోహిదాస్, సర్పంచ్లు కొడప విజయ్, కే దేవేందర్, బాబుసింగ్, సురేశ్, పీఎస్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కలు పంపిణీ
పిప్పల్దరిలో సర్పంచ్ బండారి శ్రీధర్రెడ్డి ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. వాటిని నాటి సంరక్షించాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు.
పల్లెలను సుందరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం
నార్నూర్, జూలై 9: పల్లెలను సుందరంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని వైస్ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ముక్తాపూర్లో అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, ఏపీవో జాదవ్ శేషారావ్, ఉపసర్పంచ్ విష్ణు, పంచాయతీ కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
నార్నూర్, జూలై 9: ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీవో రమేశ్ అన్నారు. మండలంలోని నాగల్కొండ గ్రామంలో గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సునీత, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, పంచాయతీ కార్యదర్శి వినోద్ పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
గాదిగూడ, జూలై 9: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సర్పంచ్ నైతం బాదుబాయి అన్నారు. మండలంలోని దాబా(బీ) గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, శంభు, ఉపసర్పంచ్ ఆనంద్రావ్ పాల్గొన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
ఇంద్రవెల్లి, జూలై 9: హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రజలు విరివిగా మొక్కలు నాటాలని డీఎల్పీవో భిక్షపతిగౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా సర్పంచ్ గాంధారితో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలకు నీరుపోసి ట్రీగార్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉట్నూర్ డివిజన్ పరిధిలోని మండలాల్లో 12 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో సంతోష్, ఈవో శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ సుంకట్రావ్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు, ఎఫ్ఎస్వో నర్సయ్య, జిల్లా పరిషత్ పాఠశాల చైర్మన్ కాంబ్లే బాపురావ్, సిబ్బంది పాల్గొన్నారు.
జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
ఇచ్చోడ, జూలై 9: సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారమని డీఐఈవో రవీందర్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. కొవిడ్ నిబంధనలు విద్యార్థులు పాటించాలన్నారు. కళాశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జాదవ్ గణేశ్ కుమార్, ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ సత్యనారాయణ, ప్రోగ్రాం అధికారి ప్రభాకర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
తలమడుగు, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కమిటీ సభ్యులు, పూజారి, గ్రామస్తులు, దేవాదాయ శాఖ అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి ప్రసాద్, వీడీసీ అధ్యక్షుడు ఆసం రవి, ఆలయ కమిటీ సభ్యులు పద్మాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.
ముమ్మరంగా పల్లె ప్రగతి పనులు
నేరడిగొండ, జూలై 9: మండలంలో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలు తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డుసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
పచ్చదనం కోసం మొక్కలు నాటాలి
ఆదిలాబాద్ రూరల్, జూలై 9: గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటాలని సర్పంచ్ లక్ష్మీబాయి, నాయకుడు సెవ్వ జగదీశ్ అన్నారు. తంతోలిలో పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రమేశ్, జడ్పీటీసీ అభ్యర్థి నరేశ్, నాయకులు పాల్గొన్నారు.