న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు పార్లమెంట్ బహిష్కరిస్తున్నామని వారు ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ ఉభయసభల టీఆర్ఎస్ సభ్యులు నల్ల దుస్తులు ధరించి సభలకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదాపడింది. లోక్సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఉభయసభలకు చెందిన టీఆర్ఎస్ సభ్యులు 16 మంది (9 మంది లోక్సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు) నిరసన ప్రదర్శన చేపట్టారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం సమగ్ర విధానం తీసుకురావాలని ప్రధానంగా తమ డిమాండ్ను వినిపించారు. అదేవిధంగా పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని, రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మరికొన్ని ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు తమ డిమాండ్లు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.