Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలోని పలు పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సాకేత్ పుష్ప విహార్లోని అమృత పబ్లిక్ స్కూల్లో మంగళవారం ఉదయం 6:45 గంటల సమయంలో పాఠశాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ మెయిల్ వచ్చింది. ఇందులో పాఠశాలలో బాంబు పెట్టినట్లుగా ఉంది.
దాంతో వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పేర్కొన్నారు. అయితే, ఈ మేయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. గతంలో డీపీఎస్ మధుర రహదారిలోని పాఠశాలకు రెండుసార్లు బాంబు బెదిరింపు వచ్చింది. ఏప్రిల్ 12న దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాదిక్ నగర్లో ఉన్న పాఠశాలకు బాంబు బెదిరింపు రావడంతో ఆ సమయంలో పాఠశాల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొన్నది.