ఏదో చేయబోతే ఏదో అయిందన్నట్టు.. అన్ని రోజులు మనవే ఉండవు. కొన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా దొరకరు కానీ.. ఒక చిన్న తప్పు చేసేటప్పుడే కొందరు అడ్డంగా దొరికిపోతారు. ముఖ్యంగా దొంగతనాలు చేసే వాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత కరుడుగట్టిన దొంగ అయినా సరే.. ఏదో ఒకరోజు దొంగతనం చేస్తూ దొరికిపోవాల్సిందే. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్లో ఈ వింత దొంగతనం చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త దగ్గర పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు గన్ గురిపెట్టిన దొంగలు అతడి నుంచి రూ.1.1 కోట్లు దొంగలించారు. ఓ జ్యూవెలరీ షాపు నుంచి రూ.1.1 కోట్లు కలెక్ట్ చేసుకొని తిరిగి వస్తున్న వారిని అడ్డగించిన దుండగులు వాళ్లకు గన్ గురిపెట్టి.. డబ్బు ఉన్న బ్యాగ్ను లాక్కెళ్లిపోయారు.
ఆ తర్వాత చాందినీ చౌక్ దగ్గర్లో ఉన్న ఖాటుశ్యామ్ అనే గుడిలో లక్ష రూపాయలు డొనేట్ చేసి ఆ దుండగులు అడ్డంగా దొరికిపోయారు. అయితే.. చాందినీ చౌక్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొంగలను పసిగట్టిన పోలీసులు.. గుడిలోకి వెళ్లడాన్ని గమనించారు. ఆ తర్వాత వాళ్లు అక్కడ డబ్బులను డొనేట్ చేయడం సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. ఆ తర్వాత వాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ట్రాన్స్ యమున ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి కోటి రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
గుడిలో డబ్బు డొనేట్ చేస్తుండగా సీసీటీవీ కెమెరాలో చిక్కడంతోనే వాళ్లను పట్టుకోగలిగామని.. లేకపోతే.. వాళ్లను పట్టుకోవడం కష్టంగా మారేదని.. పోలీసులు తెలిపారు. చాందినీ చౌక్ ప్రాంతంలోనే పోలీసులు 300 సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు.