న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భారత్ను కలవరపెడుతున్నది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఐదుకు చేరింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వైరస్ను గుర్తించారు. పాజిటివ్ వచ్చిన మొత్తం 17 మంది ప్రయాణికుల్లో 12 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించామని, అందులో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్ అని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. ప్రస్తుతం వారంతా ఎల్ఎన్జేపీ దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఈ వేరియంట్కు సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదవ్వగా, శనివారం మరో రెండు కేసులు రికార్డయ్యాయి. నిన్న గుజరాత్లోని జామ్నగర్లో ఒకటి, ముంబైలో మరో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. జింబాబ్వే నుంచి ఈ నెల 2న వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని, జన్యుక్రమ విశ్లేషణ కోసం నమూనాలను ల్యాబ్కు పంపించగా ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని గుజరాత్ హెల్త్ కమిషనర్ జయ్ ప్రకాశ్ శివహరే తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి గత నెల 23న ఢిల్లీకి, ఆ తర్వాత ముంబైకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని, నమూనాలను విశ్లేషించగా ఒమిక్రాన్గా నిర్ధారణ అయిందని ముంబై అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితులిద్దరినీ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.