న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్లో చేరిన 22 ఏండ్ల యువతికి పాజిటివ్ వచ్చింది. దీంతో హస్తినలో మంకీపాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. దవాఖానలో చేరిన యువతికి శుక్రవారం పాటిజిటివ్ వచ్చిందని ఎల్ఎన్జేపీ డాక్టర్ సురేశ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఈమధ్య కాలంలో ఆమె ఇతర దేశాలకు వెళ్లలేదన్నారు. అయితే నెల రోజుల క్రితం విదేశాలకు వెళ్లివచ్చారని పేర్కొన్నారు. దవాఖానలో ప్రస్తుతం నలుగురు మంకీపాక్స్ బాధితులు చికిత్స పొందుతున్నారని, మరొకరు కోలుకుని డిశ్చార్జీ అయ్యారని వెల్లడించారు.
ఢిల్లీలో మొదటి మంకీపాక్స్ కేసు జులై 24న నమోదయింది. అంతకు ఒకరోజు ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 89 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు మొత్తం 31,799 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 9491 కేసులు ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. స్పెయిన్లో 5162, జర్మనీలో 2,982, యూకేలో 2914, ఫ్రాన్స్లో 2423, భారత్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి.