న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 17,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం (15,097) కంటే కేసుల సంఖ్య 17.73 శాతం పెరిగింది. కొత్తగా 1,390 మంది కరోనా రోగులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 39,873కు, మొత్తం కేసుల సంఖ్య 15,06,798కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 25,136కు చేరింది. మరణాల రేటు 1.67 శాతంగా ఉన్నది.
కాగా, ఢిల్లీలో వారాంతపు లాక్డౌన్ మొదలైంది. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు 55 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిత్యవసర షాపులు, అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని షాపులు, మార్కెట్లు మూసి ఉంటాయి. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ఈ పాస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అంతర్ రాష్ట్ర బస్ టెర్మినస్ల నుండి వచ్చే లేదా వెళ్ళే వ్యక్తులను వారి టికెట్ల ఆధారంగా ప్రయాణాలకు అనుమతిస్తారు.
మరోవైపు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడిక్స్ వంటి ప్రైవేట్ వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, టెస్టింగ్ లేబొరేటరీలు, క్లినిక్లు, ఫార్మసీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వైద్య ఆక్సిజన్ సరఫరాదారులను వారాంత లాక్డౌన్ నుంచి మినహాయించారు. అలాగే న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులను గుర్తింపు కార్డులు, సర్వీస్ ఐడీ కార్డులు, ఫొటో ఎంట్రీ పాస్లు, కోర్టులు జారీ చేసిన అనుమతి లేఖలపై ప్రయాణించేందుకు అనుమతించనున్నారు.