న్యూఢిల్లీ : ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత వేధిస్తుండటం, వేసవిలో విద్యుత్ డిమాండ్ ఊపందుకోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. మరోవైపు ఢిల్లీలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని మంత్రి సత్యేందర్ జైన్ హెచ్చరించారు. ఢిల్లీ మెట్రోతో పాటు హాస్పిటళ్లకు కూడా విద్యుత్తు సరఫరాలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దాద్రి-2, ఉంచాహర్ విద్యుత్తు కేంద్రాల నుంచి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఢిల్లీ మెట్రోతో పాటు ప్రభుత్వ హాస్పిటళ్లు, ఇతర కీలక కార్యాలయాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేయడం సాధ్యం కాదు అని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
అయితే ఢిల్లీకి విద్యుత్తును అందించే పవర్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయాలని ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్ల నుంచే ఢిల్లీకి దాదాపు 30 శాతం విద్యుత్తు అందుతున్నట్టు మంత్రి చెప్పారు. ఇక వ్యవసాయ రంగానికి తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి ఇంటి ముందు నిరసన చేపడతామని కిసాన్ మజ్ధూర్ సంఘర్ష్ సమితి వెల్లడించింది.
కాగా గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ ఈసారి ఏకంగా 40 శాతం ఎగబాకిందని దీంతో ఇబ్బందులు తలెత్తాయని పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్బజన్ సింగ్ చెప్పారు. పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్ధితి నెలకొందని అన్నారు. సీఎం భగవంత్ మాన్ పరిస్ధితి సమీక్షిస్తున్నారని తెలిపారు. విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో సాగు, పారిశ్రామిక రంగాలపై ప్రతికూల ప్రభావం పడిందని, గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.