Wrestlers Protest | ఒకవైపు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంటు కొత్త భవనం ప్రారంభం జరుగుతుంటే.. అదే సమయంలో, దానికి సమీపంలో ప్రజాస్వామ్యయుత నిరసనపై పాలకుల పాశవికమిది. తమను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలనడమే ఈ మహిళా రెజ్లర్లు చేసిన నేరం. సదరు ఎంపీ సగౌరవంగా నూతన పార్లమెంటు ఆవరణలో తిరుగాడుతుంటే, ఆడబిడ్డల్ని ఇలా పోలీసులు ఈడ్చిపారేశారు.
ఒకవైపు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, విపక్ష పార్టీలు లేకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభిస్తూ.. ఈ భవనం 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం అని, పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం అని, భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని స్పీచ్ ఇచ్చారు. నవ భారత్ కొత్త మార్గాలను నిర్దేశించుకొంటూ ముందుకెళ్తుందని సెలవిచ్చారు. ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తున్నదని గొప్పలు చెప్పుకొచ్చారు.
మరోవైపు.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలన్న డిమాండ్తో నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై కేంద్ర హోంఖ ఆధ్వర్యంలోని పోలీసులు ఉక్కుపాదం మోపారు. కొత్త పార్లమెంట్ భవనానికి ర్యాలీని భగ్నం చేసి దారుణంగా ప్రవర్తించారు. రెజ్లర్లను ఈడ్చిపారేశారు. నిర్బంధించి, పోలీసు వ్యానుల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. జంతర్మంతర్ వద్ద ఆందోళన శిబిరాన్ని పీకిపారేశారు.
న్యూఢిల్లీ, మే 28: ఢిల్లీలోని జంతర్మంతర్ ఆదివారం రణరంగమైంది. నెల రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రెజ్లర్ల పట్ల కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు కర్కశంగా ప్రవర్తించాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలన్న డిమాండ్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడానికి నిరసనగా ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం వద్ద ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ నిర్వహించ తలపెట్టారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు నిర్బంధించారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించి, రెజ్లర్లపైనే కేసులు నమోదుచేశారు. నిందితుడ్ని ప్రభుత్వం రక్షిస్తున్నదని వినేశ్ ఫొగట్ ఆక్షేపించారు.
జంతర్మంతర్ వద్ద ఉద్రిక్తత
పోలీసులు అడ్డగించటంతో జంతర్మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు నిర్బంధించే సమయంలో రెజ్లర్లు ఒకరికొకరు పట్టుకొని ప్రతిఘటించారు. ఫొగట్ సిస్టర్లతో సహా మహిళా రెజ్లర్ల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని, దాడి చేశారని పేర్కొంటూ సాక్షి మాలిక్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు.
కొత్త పార్లమెంట్లో బ్రిజ్ చక్కర్లు
ఇంత జరుగుతున్నా బ్రిజ్ భూషణ్ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనంలో చక్కర్లు కొట్టారు. దీన్ని ప్రస్తావిస్తూ ‘లైంగిక వేధింపుల గూండా బ్రిజ్భూషణ్ ఈ రోజున పార్లమెంట్లో కూర్చొన్నాడు. మమ్మల్నేమో రోడ్లపై ఈడ్చిపారేశారు. క్రీడాకారులకు ఇదొక విచారణకరమైన రోజు’ అని సాక్షి మాలిక్ ట్వీట్ చేశారు.
సరిహద్దుల్లో రైతుల అడ్డగింత
మహిళా పంచాయత్కు ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న రైతులను పోలీసులు సరిహద్దులో అడ్డుకొన్నారు. బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ నేతృత్వంలోని రైతులను ఘాజీపూర్ బోర్డర్ వద్ద ఆపేశారు.
ఆందోళన శిబిరం తొలగింపు
జంతర్మంతర్ వద్ద రెజ్లర్ల శిబిరాన్ని పోలీసులు తొలగించారు. సామగ్రిని తొలగించి, టెంట్లను పీకేశారు. రెజ్లర్లు తెచ్చుకొన్న చిన్న మంచాలు, చాపలు వంటి ఇతరత్రా వాటిని పక్కన పడేశారు.