Lashkar-e-Taiba : విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి, మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది మంది ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు. అరెస్టైన ఉగ్ర నిందితులకు పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా సంస్థతో, పాక్ స్పై ఏజెన్సీ ఐఎస్ఐతోపాటు బంగ్లాదేశ్కు చెందిన మరో ఉగ్రవాద సంస్తతో సంబంధాలున్నాయి.
విదేశీ సంస్థల ఆదేశాల మేరకు నిందితులు త్వరలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఏకకాలంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో దాడులు నిర్వహించారు. నిందితుల్ని మిజానూర్ రహమాన్, మొహమ్మద్ షాబత్, ఉమర్, మొహమ్మద్ లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్గా గుర్తించారు. వీరిలో ఆరుగురు తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందిన వాళ్లు కాగా, ఇద్దరు బెంగాల్కు చెందిన వాళ్లు. అరెస్టైన వారిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు అక్రమ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. నిందితుల మొబైల్ ఫోన్లలో ఢిల్లీలో బ్లాస్ట్ చేయవలసిన ప్రదేశాలకు సంబంధించిన వీడియోలున్నాయి. అందులో ఢిల్లీ మెట్రో కూడా ఉంది. వీరి వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితులు సాధారణ వ్యక్తుల్లాగా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వీరికి కాశ్మీర్కు చెందిన ఒక తీవ్రవాది సూచనలిస్తున్నట్లు తేలింది. అతడు లష్కరే తొయిబా సంస్థకు చెందిన వాడు. కానీ, ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి ఈ ముఠాను నడిపిస్తున్నాడు. అతడు ఇంతకుముందు పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రజలన మతం పేరుతో రెచ్చగొట్టే విధంగా, ఫ్రీ కాశ్మీర్ అంటూ రూపొందించిన పోస్టర్ల గురించి విచారిస్తుండగా ఈ ముఠా వ్యవహారం బయటపడింది.