న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వివాదానికి కారణమైన నామినేటెడ్ సభ్యులైన ఆల్డర్మెన్ ఓటు హక్కు అంశాన్ని సుప్రీంకోర్టు తేల్చనున్నది. శుక్రవారం దీనిపై విచారణ జరుపనున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న (గురువారం) జరుగాల్సిన ఢిల్లీ మేయర్ ఎన్నికను మరోసారి వాయిదా వేశారు. గత ఏడాది డిసెంబర్ 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలిచింది. అయితే ఈ ఎన్నికల్లో ఓడిన బీజేపీ, మేయర్ పదవి కోసం కుయుక్తులు పన్నింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పది మంది సభ్యులను నామినేట్ చేశారు. వారి ఓటు హక్కుపై వివాదం వల్ల మేయర్ ఎన్నిక వాయిదా పడుతున్నది.
కాగా, జనవరి 6, 24తోపాటు ఫిబ్రవరి 6న మేయర్ ఎన్నిక కోసం కౌన్సిల్ సభ్యులు మూడుసార్లు సమావేశమయ్యారు. అయితే నామినేటెడ్ సభ్యులైన ఆల్డర్మెన్ కూడా ఓటు వేసేందుకు ప్రయత్నించడంతో గందరగోళం జరిగింది. ఇలా మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. సుప్రీంకోర్టు జోక్యంతో మరోసారి మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 16వ తేదీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఖరారు చేశారు.
మరోవైపు సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించింది. నామినేటెడ్ సభ్యులైన ఆల్డర్మెన్ లేకుండా ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని కోరింది. ఎంసీడీ చట్టం ప్రకారం నామినేటెడ్ సభ్యులు లేదా ఆల్డర్మెన్కు సమావేశాల్లో ఓటు హక్కు లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. శుక్రవారం ఈ అంశాన్ని తేల్చుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం జరుగాల్సిన ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.