Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. మద్యం పాలసీ కేసులో ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్నారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు పిటిషన్పై ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఈడీకి సమాధానం కోరగా.. ఈడీ స్పందనను తెలిపింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
పీఎంఎల్ఏలోని సెక్షన్ 50 కింద కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం చూపలేకపోయిందని సింఘ్వీ తెలిపారు. ఈడీ మొదటిసారి సమన్లును 2023 అక్టోబర్ 30న పంపిందని.. తొమ్మిదోసారి 2024 మార్చి 16న పంపిందని.. మొదటి.. చివరి సమన్ల మధ్య ఆరునెలల సమయం గడిచిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ను అరెస్టు చేశారన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. కేజ్రీవాల్ పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుందని.. ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా అరెస్టు జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరో వైపు ఈడీ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని.. కేజ్రీవాల్ విషయానికి వస్తే దర్యాప్తు ముగియలేదని ఈడీ తరఫున విచారణకు హాజరైన ఏఎస్జీ రాజు తెలిపారు. మనీలాండరింగ్లో నేరం స్పష్టంగా ఉందని.. ఇందులో సందేహాలకు తావులేదన్నారు. పిటిషనర్ వాదనలు బెయిల్ పిటీషన్లా ఉన్నాయని.. అరెస్టును రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను కాదని ఏఎస్జీ పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఈడీ వ్యతిరేకిస్తూ.. ఈ కేసులో దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, కేజ్రీవాల్ విషయానికి వస్తే దర్యాప్తు ముగియలేదని పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ ద్వారా ఆప్ మనీలాండరింగ్ చేసిందని, ఈ నేరం పీఎంఎల్ఏలోని సెక్షన్ 70 కిందకు వస్తుందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన సమాధానంలో పేర్కొంది.