Delhi Liquor Scam Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం అరెస్టు చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో ఎంపీ ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో ఆయనకు సన్నిహితంగా ఉండే పలువురి ఇండ్లలోనూ సోదాలు జరిగాయి. దాదాపు పది గంటలకుపైగా ఈడీ సోదాలు చేపట్టింది. ఆ తర్వాత ఎంపీని అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణ జరుపుతున్నది.
అయితే, మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ కోసం సీబీఐకి సిఫారు చేశారు. అయితే, కొత్త మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆ తర్వాత ప్రభుత్వం రద్దు చేసింది. పాలసీలో నిబంధనలను ఉల్లంఘించినందుకు, విధానపరమైన అవకతవకలకు పాల్పడ్డారన్న కారణాలతో 15 మంది నిందితులపై సీబీఐ ఆగస్టు 2022లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ కేసును ఈడీ తర్వాత దర్యాప్తు చేస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.