Delhi : అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లను ఓపెన్ చేసుకోవచ్చని, అయితే 50 శాతం కెపాసిటీతో మాత్రమే నిర్వహించుకోవచ్చని నిబంధన విధించింది. ఇక పెళ్లిళ్లకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా పెంచారు. ఇంతకు పూర్వం కేవలం 20 మందితో మాత్రమే నిర్వహించుకోవాలని నిబంధన విధించారు. ఇప్పుడు 200 మంది వరకూ హాజరు కావొచ్చని పేర్కొన్నారు. అయితే నైట్ కర్ఫ్యూ మాత్రం అమలులో వుంటుందని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ యథావిథిగానే వుంటుందని అధికారులు తెలిపారు.
ఢిల్లీలో కోవిడ్ కేసులు కాస్తలో కాస్త తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పాఠశాలలు, కాలేజీలు మాత్రం యథావిథిగా మూసేవేసే ఉంచుతామని తెలిపారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం గురువారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని కేసులు, పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాతే వీకెండ్ కర్ఫ్యూను ఎత్తేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అనుమతి వచ్చింది. 50 శాతం మంది ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేస్తాయని పేర్కొన్నారు.