National Herald Case : కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసులలో వారిని కోరింది. ఈ కేసుకు సంబంధించి గతంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకోవడానికి ట్రయల్ కోర్టు నిరాకరించింది.
దాంతో ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు రాహుల్గాంధీ, సోనియాగాంధీతోపాటు ఈ కేసులోని ఇతరులకు నోటీసులు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్గాంధీతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే తదితరులు మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్గాంధీ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు పొందిందని ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది.