న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ ఖలీద్(Umar Khalid)కు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరీ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఖలీద్కు బెయిల్ జారీ చేసింది. ఖలీద్ తల్లికి వైద్య చికిత్స జరగాల్సి ఉంది, ఈ నేపథ్యంలో తల్లిని చూసేందుకు కోర్టు అతనికి అనుమతి ఇచ్చింది. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ మధూ జైన్తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. విస్తృతమైన కోణంలో ఈ సమస్యను పరిశీలించి, తల్లికి సర్జరీ ఉన్న నేపథ్యంలో ఉమర్ ఖలీద్కు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. జూన్ ఒకటో తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు బెయిల్ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ఖలీద్ తన తల్లితో గడపనున్నాడు.
బెయిల్ సమయంలో ఖలీద్ తన అడ్రెస్లోనే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఆస్పత్రిలో ఉన్న తల్లిని మాత్రమే విజిట్ చేయాలని కోర్టు తెలిపింది. లక్ష పూచీకత్తుపై కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. అతని వద్ద ఒకే ఒక్క మొబైల్ నెంబర్ ఉండాలని కోర్టు సూచించింది. మే 19వ తేదీన సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉమర్ ఖలీద్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 15 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని ఉమర్ తన పిటీషన్లో కోరాడు.
ఢిల్లీ పోలీసుల తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఆ బెయిల్కు వ్యతిరేకంగా వాదించారు. 2020 సెప్టెంబర్ లో ఉమర్ ఖలీద్ను అరెస్టు చేశారు. నేరపూరిత కుట్ర, అల్లర్లు, అక్రమ జన సమీకరణ, యూఏపీఏ నేరాలను అతనిపై మోపారు.