రక్షణ శాఖ స్థలంలో ప్రైవేట్ సంస్థ కార్యకలాపాలా?
కేంద్ర ప్రభుత్వం, ఆర్మీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కంటోన్మెంట్ ప్రాంతం లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రైవేట్ క్రీడాసంస్థను అనుమతించడంపై ఢిల్లీ హైకోర్టు గురువారం కేంద్రంతో పాటు సైనిక దళంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ‘మాకు అది కావాలి. ఇది కావాలి. హైకోర్టును మాకివ్వండి అంటూ రేపటి నుంచి ప్రతి సంఘం అడుగుతుంది. అలా అడిగినవారికి ఇండియా గేట్ను కూడా ఇచ్చేస్తారా?’ అని జస్టిస్ రేఖా పల్లి ప్రశ్నించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ నుంచి విజ్ఞప్తి మేరకే ఆ సంస్థను అనుమతించామని అధికారులు చెప్పడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రీఫ్యాబ్రికేటెడ్ నిర్మాణానికి చాలా తక్కువ (20*12 అడుగుల) స్థలాన్ని ఇచ్చామని అధికారులు చెప్పడంతో.. ఎంత తక్కువ స్థలమైనా ఇవ్వడానికి వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.