AAP | న్యూఢిల్లీ, మార్చి 27: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే యోచనలో కేంద్రం ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమిదేనని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటికీ జైలు నుంచే కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆప్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, ‘జైలు నుంచి పాలన జరగదని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నా’ అని ఎల్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఎల్జీ వీకే సక్సేనా వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారం వల్లనే అనేది స్పష్టమవుతుందని మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. ఏ నిబంధనతో రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రశ్నించారు.