దేశంలో ఉత్పత్తి పెరిగినా.. కృత్రిమ కొరత సృష్టి
రికార్డుస్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేశామంటూ దేశీయ కంపెనీల ప్రకటనలు ఒకవైపు.
నల్ల బంగారం కరువై విద్యుదుత్పత్తి నిలిచిపోతుందంటూ ప్లాంట్ల గగ్గోలు మరోవైపు.
బొగ్గును విద్యుత్తు ప్లాంట్లకు రవాణా చేసే రైల్వే ర్యాక్లు తగినంతగా లేవని ఓ వైపు.
బొగ్గు గూడ్స్ రైళ్ల కోసం 1,100 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశామని కేంద్రం ఇంకోవైపు.
వెరసి మొత్తం మీద దేశంలో బొగ్గుకు కటకట ఉందన్న ప్రచారం పెద్దయెత్తున జరిగిపోయింది.
దీంతో ఎంత ఖర్చు చేసైనా విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్తు ప్లాంట్లకు కేంద్రప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది. అలాగే బొగ్గు దిగుమతులపై రాష్ర్టాలపై ఒత్తిడి పెంచుతున్నది. తొలుత కొరత ఏర్పడిపోయిందన్న ప్రచారం, అటుతర్వాత దిగుమతి చేసుకోవాలన్న ఒత్తిడి. ఈ నేపథ్యంలో మరొకరి ప్రయోజనాల కోసం దేశంలో బొగ్గు కృత్రిమ కొరతను మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగా సృష్టించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ, మే 19: దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి 5% పెరిగి 6,220 లక్షల టన్నులకు చేరగా, సింగరేణిది 28.5 శాతం వృద్ధిచెంది 650 లక్షల టన్నులకు పెరిగింది. సొంత అవసరాలకు వినియోగించుకోవడానికి గనులు కలిగిన కంపెనీలు 890 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసుకున్నాయి. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిన స్థాయిలోనే బొగ్గు ఉత్పత్తి కూడా అధికమైనపుడు కొరత ఎక్కడ్నుంచి అనే సందేహాలు కలుగడం సహజం. విద్యుత్తు ప్లాంట్ల వద్ద బొగ్గు కొరత ఏర్పడటానికి తగిన రైలు ర్యాక్లు లేకనా? ప్రయాణీకుల రైళ్లతో బిజీగా ఉన్న రైల్వే ట్రాక్లు కారణమా?
అందుకే బొగ్గు కృత్రిమ కొరత
వేరొకరి ప్రయోజనాల కోసమే దేశంలో బొగ్గు కృత్రిమ కొరతను సృష్టించారు. ఖరీదైన విదేశీ బొగ్గు వాడకంతో విద్యుదుత్పాదకత వ్యయం 30% పెరిగిపోతుంది. మనకు బొగ్గు గనులు లేవా? విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?
–ఢిల్లీ విద్యుత్తు మంత్రి సత్యేందర్ జైన్
ఒప్పందం లోగుట్టు ఏమిటో..
నెలరోజుల క్రితం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరుదేశాలు జరిపే ఎగుమతి దిగుమతులకు సుంకాలు జీరో స్థాయికి దిగివస్తాయి. ఆ దేశం నుంచి జరిగే బొగ్గు దిగుమతులపై భారత్ సుంకాలు విధించదు. వాస్తవానికి ఆస్ట్రేలియా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో మూడింట రెండు వంతులు బొగ్గే. అక్కడ క్వీన్స్ల్యాండ్లో కార్మిచెల్ బొగ్గు గని అదానీ గ్రూప్దే. తాజా ట్రేడ్ డీల్ ద్వారా ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేండ్లలో 27 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరాలంటే ఆస్ట్రేలియా నుంచి ఇండియా భారీగా బొగ్గును దిగుమతి చేసుకోవాలి. దీంతో ఎక్కువ లాభపడేది అదానీ గ్రూపే. అంతేకాదు, దేశంలోకి బొగ్గు దిగుమతి చేసే అదానీ ఎంటర్ప్రైజెస్.. ఎన్టీపీసీకి 10 లక్షల టన్నులు దిగుమతి చేసే కాంట్రాక్టును ఇటీవలే పొందింది. దేశంలోని విద్యుత్తు ప్లాంట్లు 10 శాతం విదేశీ బొగ్గును ఉపయోగించాలన్న కేంద్రం తాజా ఆదేశాలతో ఎన్టీపీసీ తెచ్చుకునే అదానీ బొగ్గు మరింత పెరుగుతుంది.