న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చలికాలంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు భారీ వాహనాలు, ట్రక్కులపై నిషేధం విధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు ఆ వాహనాలను ఢిల్లీలోకి అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొద్ది సంవత్సరాల నుంచి చలికాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోతున్న సంగతి తెలిసిందే.
హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక వాడల నుంచి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు, పంటల చెత్తను కాల్చడం ద్వారా వస్తున్న కాలుష్య కారకాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇక చాలా ట్రక్కులు డీజిల్తో నడవడం వల్ల వాయు కాలుష్యం బాగా పెరిగిపోతుందని తెలిపింది. దీంతో వాయు కాలుష్యాన్ని నివారించడానికి భారీ వాహనాలు, ట్రక్కుల నిషేధాన్ని అమలు చేయనుంది.