Arvind Kejriwal | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు ‘మద్యం పాలసీ’లో అసలు కుంభకోణమే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాల్లో అబద్ధాలు చెప్తున్నాయని ఆరోపించారు. అరెస్టు చేసిన వారిని థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ అకారణంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. ‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసులో సీబీఐ సమన్లు జారీ చేయడంపై శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర సర్కారు వైఖరిని ఎండగట్టారు. రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కి వేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను అసాధారణ రీతిలో వినియోగిస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మద్యం పాలసీలో కుంభకోణమేమీ జరుగలేదని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.‘ ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా 14 ఫోన్లను ధ్వంసం చేశారని అధికారులు గతంలో చెప్పారు. నాలుగు ఫోన్లు తమ దగ్గర ఉన్నాయని ఈడీ, ఒక ఫోన్ తమ దగ్గర ఉన్నదని సీబీఐ ఇప్పుడు చెప్తున్నది. సిసోడియా 14 ఫోన్లను నాశనం చేసి ఉంటే.. ఏజెన్సీలకు ఆ ఫోన్లు ఎలా వచ్చాయి? న్యాయస్థానాలకు సమర్పించే అఫిడవిట్లలో కూడా దర్యాప్తు సంస్థలు అబద్ధాలు చెబుతున్నాయి. చేయని నేరాన్ని కూడా ఒప్పుకోవాలంటూ అనుమానితులపై తీవ్ర బెదిరింపులకు దిగుతున్నారు. ‘రేపు నీ కూతురు కాలేజీకి వస్తుందిగా. ఆమె ఎట్లా వస్తుందో చూస్తా’ అంటూ విచారణకు పిలిచిన కొందరిని బెదిరిస్తున్నారు. ఈ స్థాయి వార్నింగ్లు ఎప్పుడైనా చూశామా?’ అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం పాలసీ ద్వారా సిసోడియా లబ్ధి పొందారని అంటున్నారని.. ఏడాది నుంచి విచారణ జరుపుతున్నా ఇంతవరకూ ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని కేజ్రీవాల్ తెలిపారు. ‘రూ.100 కోట్ల స్కామ్ జరిగినట్టు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. 400కు పైగా జరిగిన సోదాల్లో ఎలాంటి సొమ్మును గుర్తించనప్పుడు.. గోవా ఎన్నికల ప్రచారంలో మేము ఆ సొమ్మును వినియోగించామని ఎలా చెప్తారు? ఆధారం ఏంటి? మేం ప్రతి చెల్లింపును చెక్కుల రూపంలోనే చేశాం. ఇప్పుడు నేనొక విషయం చెప్తా. ఎలాంటి ఆధారం లేకుండా సెప్టెంబర్ 17న రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీకి నేను రూ.వెయ్యి కోట్లు ఇచ్చానని చెప్తా. అప్పుడు మీరు ప్రధానిని అరెస్టు చేస్తారా?’ అని దర్యాప్తు సంస్థలను సూటిగా ప్రశ్నించారు.
దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన వారిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసుతో తనకు, మరికొంతమందికి సంబంధమున్నదని చెప్పాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పారు. ‘ఈ మద్యం పాలసీనే పంజాబ్లో కూడా అమలు చేస్తున్నాం. దానివల్ల ఆదాయం 50 శాతం పెరిగింది. ఇది పారదర్శక, గేవ్ు ఛేంజింగ్ పాలసీ. ఆదివారం సీబీఐ విచారణకు తప్పకుండా వెళ్తాను. కేజ్రీవాల్ అవినీతిపరుడైతే.. ఈ ప్రపంచంలో నిజాయితీపరుడెవరూ ఉండరు. నన్ను అరెస్టు చేయాలని సీబీఐకి బీజేపీ ఆదేశాలు ఇస్తే.. సీబీఐ తప్పకుండా పాటిస్తుంది’ అని అన్నారు.
తల నుంచి పాదాల వరకు అవినీతిలోనే మునిగిపోయిన మోదీకి అవినీతి ఓ సమస్యగా ఎలా కనిపిస్తున్నదో అర్థం కావట్లేదని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ‘పేదరికాన్ని తరిమికొట్టి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామని ఆప్ పేదలకు మాటిచ్చింది. మోదీ ఆ ఆశలను చిదిమేయాలనుకొంటున్నారు. అందుకే, 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ పార్టీపై జరుగనన్ని దాడులు ఆప్పై జరుగుతున్నాయి. 30 ఏండ్ల బీజేపీ పాలన, 12 ఏండ్లు మోదీ సీఎంగా ఉన్న గుజరాత్లో ఇప్పటికీ ఒక్క పాఠశాల కూడా బాగుపడలేదు. అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలోనే ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలనే మార్చివేశాం. ఆప్ను దెబ్బతీయడానికి నంబర్ 2 (మనీశ్ సిసోడియా), నంబర్ 3 (సత్యేందర్ జైన్)ను జైలుకు పంపారు. ఇప్పుడు నన్ను లక్ష్యంగా చేసుకొంటున్నారు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు విపక్షాల ఐక్యత కోసం కలిసి రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అరవింద్ కేజ్రీవాల్ను కోరారు. సీబీఐ సమన్లు అందుకున్న కేజ్రీవాల్కు శుక్రవారం సాయంత్రం ఖర్గే ఫోన్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం గురించి కేజ్రీవాల్తో మాట్లాడారు.
కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ శాసనసభను సోమవారం ప్రత్యేకంగా సమావేశపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఇప్పటికే ఈ కేసులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. విపక్షం అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్రం టార్గెట్ చేసింది. సీబీఐ, ఈడీలను ఆయుధాలుగా చేసుకుని విపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయిస్తున్నది. ఈ పరిస్థితి ఎంతమాత్రం మంచిది కాదు. దీనిపై కచ్చితంగా శాసనసభలో చర్చ జరగాలి’ అని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ శనివారం మీడియాకు తెలిపారు. ఈ కేసులో ఆదివారం తమ ముందు హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఇప్పటికే సీబీఐ, ఈడీ సమన్లు జారీ చేసింది. ‘అబద్ధాలతో, తప్పుడు సాక్ష్యాలతో మాపై నమోదు చేస్తున్న కేసులపై సీబీఐ, ఈడీలపై న్యాయస్థానాలలో కేసులు వేస్తాం’ అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
కేజ్రీవాల్కు సీబీఐ సమన్లపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను ఇలాంటి వేధింపులతో టార్గెట్ చేస్తారని గతంలోనే చెప్పానన్నారు. విపక్ష రహిత భారత్గా దేశాన్ని తయారు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, అందుకే తనకు వ్యతిరేకంగా పోరాడుతున్న విపక్ష నేతల ఇమేజ్ను దెబ్బతీయాలనుకుంటున్నదని ఆరోపించారు. ఈ అధికార దుర్వినియోగంపై ఇకనైనా విపక్షాలన్నీ ఏకమై గళమెత్తాలని, గత ఏడాదిగా కేసులతో వేధిస్తున్న దర్యాప్తు సంస్థల వైఖరిని నిలదీయాలని, అలా చేస్తే కాని కేంద్రంలోని బీజేపీని నిలువరించలేరని సూచించారు. ‘దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నేతలందరినీ బీజేపీ లక్ష్యంగా చేసుకున్నది. వారు దేశంలో ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటున్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు ఇతర నేతలను మోదీ ప్రభుత్వం ఎలా వేధిస్తున్నదో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం’ అని అన్నారు. ప్రజాస్యామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను గద్దె దించడానికి 10వ షెడ్యూల్లోని అంశాలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. కేజ్రీవాల్కు సమన్లపై చట్టం తన పనిచేస్తున్నదని బీజేపీ వ్యాఖ్యానిస్తున్నదని, అయితే తాను మాత్రం విపక్షాలపై పీడన ప్రారంభమైనట్టు భావిస్తానని సిబల్ పేర్కొన్నారు.
ఆదివారం కేజ్రీవాల్ను విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భద్రత కోసం వెయ్యి మంది పోలీసులను మోహరించనున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రౌజ్ అవెన్యూలోని ఆప్ ఆఫీసు వద్ద కూడా భద్రతను కట్టుదిట్దం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆప్ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండటానికి తగినన్ని బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
తమిళనాడులో గవర్నర్ రవితో రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిన వివాదాల నేపథ్యంలో సీఎం స్టాలిన్కు మద్దతు తెలుపుతూ కేజ్రీవాల్ శనివారం లేఖ రాశారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రతిరోజూ దెబ్బలు తగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్టు ప్రకటించారు. బిల్లులను ఆమోదించకుండా ఆపేయడం ప్రజాతీర్పును అవమానించినట్టేనన్నారు.
కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఏం జరుగుతున్నదో ప్రజలకు తెలుసు. ఆయన చాలా గౌరవం కలిగిన వ్యక్తి. తన రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు చేశారు. తనపై తీసుకుంటున్న అన్ని చర్యలకు ఆయన సరైన సమయంలో సమాధానమిస్తారు. కేంద్రం తీరు కారణంగానే మేం బీజేపీకి వ్యతిరేకంగా వీలైనన్ని ఎక్కువ విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
– నితీశ్ కుమార్, బీహార్ సీఎం
ఇది ఒక ప్రభుత్వమేనా? వాళ్లు(బీజేపీ) ముఠాను నడిపిస్తున్నారు. వాళ్లు పెద్ద హామీలిస్తారు కానీ ఎలాంటి ఫలితాలు రావు. అయితే కేజ్రీవాల్కు మాత్రం సీబీఐ నోటీసులు వస్తాయి. ఎన్సీపీని కూడా ముక్కలు చేయాలని ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నారు. విజయ్ మాల్యా ను వెనక్కి తీసుకు రాలేనప్పుడు, నల్లధనాన్ని ఎలా వెనక్కి తెస్తారు?
– సంజయ్ రౌత్, శివసేన(ఉద్ధవ్ వర్గం) నేత
విపక్షాలను భయపెట్టడానికి, వాటికి ప్రమాదం కలిగించడానికి సాక్షాత్తు ప్రధానమంత్రే కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఆధార్లాలేకపోయినా అరెస్టులు కొనసాగిస్తున్నారు. ఇది అన్యాయం.
– ఆతిశీ, ఆప్ సీనియర్ నాయకురాలు
మద్యం విధానం కేసులో కేజ్రీవాల్కు భయం లేకపోతే లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవాలి. ఆప్కు ఇది మాటల దాడి చేసే సమయం కాదు, నిజాయితీని నిరూపించుకోవాల్సిన తరుణం.
– గౌరవ్ భాటియా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి