న్యూఢిల్లీ : ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా తాము ఉపాధి రంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ 75,800 కోట్ల బడ్జెట్ను సిసోడియా సమర్పించారు. ఈ ఏడాది ఢిల్లీ బడ్జెట్ను ఆయన ఉపాధి బడ్జెట్గా అభివర్ణించారు.
ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఢిల్లీ ఆర్ధిక వ్యవస్ధను పరుగులు పెట్టిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. వచ్చే ఐదేండ్లలో ఢిల్లీలో ఉద్యోగుల జనాభాను ప్రస్తుతమున్న 33 శాతం నుంచి 45 శాతానికి పెంచాలనే లక్ష్యంతో చర్యలు చేపడతామని చెప్పారు. రిటైల్, ఫుడ్, రవాణా, సప్లయిచైన్, ట్రావెల్, టూరిజం, వినోద, నిర్మాణ, రియల్ఎస్టేట్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచుతామని మనీష్ సిసోడియా పేర్కొన్నారు.
ఢిల్లీ పౌరులకు ఓటర్ ఐడీ కార్డులతో అనుసంధానిస్తూ హెల్త్ కార్డులు అందచేస్తామని తెలిపారు. ఈ పధానికి రూ 160 కోట్లు కేటాయించామని చెప్పారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున టూరిజం రంగాన్ని ప్రోత్సహించేలా డిల్లీ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని వెల్లడించారు.