న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఎర్ర చందనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) స్వాధీనం చేసుకున్నది. షార్జాకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 14.63 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం విలువ రూ.11.70కోట్లు ఉంటుందని పేర్కొంది. ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ) సబర్మతి వద్ద నుంచి యూఏఈలోని షార్జాకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉండగా పట్టుకున్నట్లు పేర్కొంది.
భారీ మొత్తంలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు డీఆర్ఐ ‘ఆపరేషన్ రక్త్ చందన్’ను ప్రారంభించింది. ఐసీడీ సబర్మతి వద్ద ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన సరుకును అధికారులు గుర్తించారు. టాయిలెట్ వస్తువుల పేరిట ఉన్న సరుకును ఎలక్ట్రిక్ డివైజ్తో అధికారులు స్కాన్ చేయగా.. కొన్ని దుంగలు బయటపడ్డాయి. అనంతరం వాటిని అధికారులు పరిశీలించగా.. ఎర్రచందనంగా తేలింది. ఇదిలా ఉండగా.. ఫారిన్ ట్రేడ్ పాలసీ ప్రకారం.. ఎర్రచందనం ఎగుమతిపై భారత్ నిషేధం విధించింది.
2020-21 సంవత్సరంలో డీఆర్ఐ 96 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకోగా.. దాని విలువ రూ.150కోట్లపైనే. ఈ ఏడాది మార్చిలో కృష్ణపట్నంలోని సీఎఫ్ఎస్లోని కంటైనర్లో గృహోపకరణాలతో కలిసి కార్గోలో మలేషియాకు అక్రమంగా 12.20 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం తరలిస్తుండగా డీఆర్ఐ స్వాధీనం చేసుకున్నది. అదే నెలలో, ట్రాక్టర్ విడిభాగాల ఎగుమతి ముసుగులో భారత్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 11.7 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం కలపను గుజరాత్ ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్నారు.