చిక్కడపల్లి, మార్చి22: బీసీల సంక్షేమం, అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు, ఆరె కటికలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఆరె కటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడు భూంపల్లి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అరెకటికల ఐక్యత యాత్ర ముగింపు సభ సోమవారం సాయత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు నాణ్యమైన విద్యను అందించడాకి ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆరెకటికలు విద్య, రాజకీయంగా రాణించాలన్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఆరె కటికలు సంఘటితంగా ముందుకు సాగాలని, హక్కులను సాధించుకోవాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి నందీశ్వర్ పాల్గొన్నారు.