న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి జరిగిన సోదాల్లో తన కుటుంబానికి క్లీన్ చిట్ లభించిన నేపథ్యంలో.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశారు. ప్రధాని చేయించిన దర్యాప్తులో సీబీఐ అధికారులకు తన ఇంట్లోగానీ, బ్యాంకు లాకర్లోగానీ ఏమీ లభించలేదని వ్యాఖ్యానించారు.
తన లాకర్లో తన భార్య, పిల్లలకు సంబంధించిన రూ.70 వేల విలువ చేసే ఆభరణాలు మాత్రమే ఉన్నాయని సిసోడియా చెప్పారు. ప్రధాన మోదీ నా ఇంట్లో సోదాలు చేయించినా, నా లాకర్ను తనిఖీ చేయించినా ఏమీ దొరకలేదని, ఇది తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని ఆదేశాలతో జరిగిన అన్ని సోదాల్లో తన కుటుంబానికి, తనకు క్లీన్ చిట్ లభించిందన్నారు.
సోదాల సందర్భంగా సీబీఐ అధికారులు డీసెంట్గా వ్యవహరించారని సిసోడియా చెప్పారు. తన ఇంట్లో ఏమీ ఉండవు, దొరకవు అని సీబీఐ అధికారులకు ముందే తెలుసని, అయినా ప్రధాని మోదీ ఒత్తిడితో సోదాలు చేశారని వ్యాఖ్యానించారు. సోదాల్లో ఏమైనా దొరికితే తనను కొన్ని నెలలు జైల్లో పెట్టవచ్చని ప్రధాని భావించారని, కానీ ఆయన అనుకున్నట్లుగా జరుగలేదని ఆరోపించారు.