న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆయనను మార్చి 4 వరకు కస్టడీకి ఇచ్చేందుకు సీబీఐ కోర్టు సోమవారం అనుమతించింది. సీబీఐ అధికారులు సిసోడియాను అదివారం విచారణకు పిలిచి.. దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం సిసోడియాను కోర్టులో హాజరుపరిచారు. తమ వద్ద ఉన్న ఆధారాలకు సిసోడియా చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదని, తప్పించుకొనేలా సమాధానాలు చెబుతున్నారని, మద్యం పాలసీ కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు ఆయనను కస్టడీకి అప్పగించాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇదే సమయంలో సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ గట్టిగా వాదనలు వినిపించారు.
సీబీఐ అధికారులు కోరుకొన్న విధంగా సమాధానాలు ఎలా ఇస్తారని అన్నారు. సమన్లు జారీచేసినప్పుడు సిసోడియా విచారణకు హాజరయ్యారని, సోదాలు కూడా నిర్వహించారని, మరి విచారణకు సహకరించకపోవడం ఎక్కడున్నదని సీబీఐ తీరును ప్రశ్నించారు. అనంతరం కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. సిసోడియా రాజకీయ కక్షకు బాధితుడు. ఆయనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉన్నది. ఈ కేసు నిలబడదు’ అని పేర్కొన్నారు. మార్చి 4న బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామని, విచారణ చేసేందుకు మరింత సమయం కావాలన్న సీబీఐ అభ్యర్థన మేరకే సిసోడియాను కోర్టు కస్టడీకి అప్పగించిందని అన్నారు.
బీజేపీ భయపడుతున్నది: సంజయ్ సింగ్
సిసోడియా అరెస్టును ఖండిస్తూ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఆప్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పలు చోట్ల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో ఆందోళన చేపట్టిన ఆప్ కార్యకర్తలను అరెస్టు చేశారు. స్థానిక పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను పెద్దఎత్తున మోహరించారు. పంజాబ్, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో ఆప్ నేతలు కార్యకర్తలు ఆందోళనలు చేశారు. చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసనలు తెలిపారు. ఆప్కు పెరుగుతున్న ప్రజాదరణ, సాధిస్తున్న విజయాల పట్ల బీజేపీ భయపడుతున్నదని, అసూయ పడుతున్నదని ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. దేశంలో నియంతృత్వం తారాస్థాయికి చేరిందని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని బీజేపీని హెచ్చరించారు. సిసోడియా అరెస్టును దేశవ్యాప్తంగా పలువురు సీఎంలు, పలు పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు.
బీజేపీ కార్యాలయం ముట్టడి
సుల్తాన్బజార్, ఫిబ్రవరి 27: సిసోడియా అరెస్ట్ను నిరసిస్తూ ఆప్ నేతలు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ దేశంలో ఏక పార్టీ నియంతృత్వ రాజ్యాన్ని సృష్టించేందుకు ఇతర పార్టీలు, ప్రజాస్వామ్య గొంతుకను శాశ్వతంగా అణచివేసేందుకు ప్రధాని మోదీ కుట్రలో భాగంగానే సిసోడియాను అరెస్టు చేశారని అన్నారు. మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు తప్పకుండా తిరగబడతారని పేర్కొన్నారు.
అరెస్టుకు సీబీఐ అధికారులూ వ్యతిరేకం
సిసోడియా అరెస్టును చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. సిసోడియా అంటే వారందరికీ అపారమైన గౌరవం ఉన్నది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, ఆయనను అరెస్టు చేయడంలో రాజకీయ ఒత్తిళ్లు తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. అధికారులు వాటికి తలొగ్గాల్సి వచ్చింది.
– ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
సిసోడియా అరెస్టును ఖండిస్తున్నా
సిసోడియా అరెస్టును ఖండిస్తున్నా. ప్రజ ల కోసం, ముఖ్యంగా బలహీనవర్గాల కోసం పనిచేస్తున్న, వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల గొంతుకను అణచివేసే కుట్రలో ఇది మరో ప్రయత్నమని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
– హేమంత్ సొరేన్, జార్ఖండ్ సీఎం
ప్రజాస్వామ్యంపై దాడి
ప్రతిపక్షాలను బెదిరించేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందనే దానికి సిసోడియా అరెస్టు మరో ఉదాహరణ. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడి. ఇటువంటి అణచివేత చర్యలు మన దేశ పునాదిని దెబ్బతీస్తాయి. దీన్ని ప్రతిఘటించాలి.
– విజయన్, కేరళ సీఎం
బీజేపీ.. దేశానికి ఓ వ్యాధి
రాజ్యాంగ సంస్థల స్వతంత్రత, రాజ్యాంగ విలువలపై బీజేపీ నిరంతరంగా దాడి చేస్తున్నది. భారత ప్రజాస్వామ్య మూలాలను దెబ్బతీస్తున్న బీజేపీ.. ఈ దేశానికి ఓ వ్యాధి వంటిది.
– తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత
ప్రతిపక్ష నేతలే టార్గెట్
సిసోడియా అరెస్టును తీవ్రంగా ఖండిస్తు న్నాం. ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలు, నేతలే లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నది. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను ‘త్రిశూల్’ మాదిరిగా రాజకీయ ప్రత్యర్థులపైకి ప్రయోగిస్తున్నది.
– బృందాకరత్, సీపీఎం సీనియర్ నేత
‘దేశంలో దర్యాప్తు సంస్థలు అసలు దొంగలను వదిలి బీజేపీ చూపెట్టిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నాయి. సిసోడియా అరెస్టు బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట’
– మంత్రి జగదీశ్రెడ్డి