న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని కరోనా టీకా కేంద్రాలు 24 గంటలు పని చేయనున్నాయి. కరోనా వైరస్ నాలుగోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసేందుకు మూడో వంతు టీకా కేంద్రాలను రోజంతా నిర్వహించాలని పేర్కొంది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని టీకా కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోజులో 12 గంటలు పని చేసేలా ఆదేశించింది.
కాగా, ఢిల్లీ ఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి ఎస్ సునీల్ సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ‘కోవిడ్ -19 టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి, కోవిడ్ టీకా కేంద్రాల పనితీరును మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 06.04.2021 (మంగళవారం) నుంచి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులలోని మూడింట ఒక వంతు టీకా కేంద్రాలు రాత్రి 9 గంటల నుండి ఉదయం 9 వరకు పనిచేస్తాయి’ అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కోదానిలో ఐదు నుంచి ఆరు చొప్పున సుమారుగా 782 టీకా కేంద్రాలున్నాయి. అయితే ఢిల్లీ ప్రజలందరికీ కరోనా టీకా వేసేందుకు వారికి అందుబాటులో ఉన్న స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది.