Asiya Andrabi : కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు, దఖ్తరన్ ఇ మిల్లట్ సంస్థ చీఫ్ ఆసియా అంద్రాబీ అనే మహిళకు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. అలాగే ఆమె అనుచరులైన సోఫి ఫెహ్మీదా, నహిదా నస్రీన్కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ/ఉపా) కింద ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో, అడిషనల్ సెషన్స్ జడ్జ్ చందర్ జిత్ సింగ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది.
దేశం నుంచి జమ్మూ కాశ్మీర్ను విడగొట్టేందుకు కుట్రలు పన్నడం, దేశానికి వ్యతిరేకంగా పోరాడటం వంటి నేరాల కింద వీరికి కోర్టు ఈ శిక్ష విధించింది. ఉగ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలున్నట్లు తేలింది. నిందితులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్లు ఆరోపించింది. కొంతకాలంగా ఈ కేసుపై వాదనలు కొనసాగాయి. గత జనవరి 14న వీరిపై మోపిన నేరాల్ని కోర్టు గుర్తించింది. ఈ సందర్భంగా నిందితులు ముగ్గురికి కఠిన శిక్ష విధించాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడాలనుకునే మిగతావారికి ఈ శిక్ష ఒక సందేశం కావాలని ఎన్ఐఏ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. సెక్షన్ 20, 38, 39, 153 ఏ, 153బి, 120బి, 505, 121ఏ వంటి సెక్షన్ల కింద నిందితులకు కోర్టు తాజా శిక్ష ఖరారు చేసింది.
ఆసియా కాశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడానికి వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపించింది. ఒక మహిళా సంస్థ ద్వారా కాశ్మీర్ను పాకిస్తాన్లో కలపాలనే లక్ష్యంతో కుట్రలు చేసింది. అలాగే షరియా చట్టాన్ని సమర్ధించింది. గతంలో అనేక ఆరోపణలపై ఆసియాను చాలాసార్లు అరెస్టు చేశారు. చివరగా 2018లో ఎన్ఐఏ అరెస్టు చేసింది.