న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఇన్సులిన్ అవసరమా? కాదా? నిర్ణయించడం కోసం ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ను ఢిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. ఆయన వైద్యుడు ఆయనకు సూచించిన ఆహారానికి, ప్రస్తుతం ఆయన జైలులో తింటున్న ఇంటి భోజనానికి తేడా ఉందా? అనే విషయాన్ని కూడా పరిశీలించాలని తెలిపింది. తన భార్య సమక్షంలో తన వైద్యుడిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. జైలులో తనకు ఇన్సులిన్ను ఇవ్వకపోవడం వల్ల తన బ్లడ్ సుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా పెరుగుతున్నాయని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు. కోర్టు స్పందిస్తూ, అవసరమైన అన్ని రకాల చికిత్సలను కేజ్రీవాల్కు అందజేయాలని అధికారులను ఆదేశించింది.
తీహార్ జైలు అధికారులు ఆదివారం విడుదల చేసిన స్టేట్మెంట్లో, తాము ఎయిమ్స్ వైద్యులతో కేజ్రీవాల్కు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. వైద్యు లు ఆయనకు ఇన్సులిన్ ఇవ్వాలని చెప్పలేదని తెలిపారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ తీహా ర్ జైలు సూపరింటెండెంట్కు సోమవారం రాసిన లేఖలో, తాను ప్రతి రోజూ ఇన్సులిన్ అడుగుతున్నానని, మధుమేహం పరిస్థితి పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పలేదని తెలిపారు.