న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ప్రధాన నిందితుడైన మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో అయిదు రోజులు పొడిగించింది. సిసోడియా విచారణలో కీలకమైన సమాచారం లభించిందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆయనను ఇతర నిందితులైన మాజీ ఎక్సైజ్ కమిషనర్ రాహుల్ సింగ్, దినేశ్ అరోరా, అమిత్ అరోరాతో కలిపి విచారణ చేయాల్సి ఉందని వెల్లడించింది.
సిసోడియా ఈ-మెయిల్, మొబైల్ ఇతర డివైస్ల నుంచి భారీ సమాచారాన్ని విశ్లేషణ చేస్తున్నామని చెప్పింది. దీనిపై సిసోడియా న్యాయవాది స్పందిస్తూ కేసులో ప్రాథమిక సాక్ష్యాలైనా లభించ లేదని, ఈ నేపథ్యంలో కస్టడీ పొడిగింపులో అర్థం లేదన్నారు.
సిసోడియా బంగ్లా ఆతిశీకి కేటాయింపు
మనీశ్ సిసోడియా రాజీనామా నేపథ్యంలో ఆయన నివసిస్తున్న బంగ్లాను కొత్త మంత్రి ఆతిశీకి కేటాయించారు. మార్చి 21లోగా బంగ్లాను ఖాళీ చేయాలని అధికారులు సిసోడియా కుటుంబాన్ని కోరారు.