న్యూఢిల్లీ: పెళ్లి కోసం ఒత్తిడి చేసిన సహోద్యోగిని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు. (cop killed woman colleague) రెండేళ్ల తర్వాత ఈ విషయం బయటపడటంతో అతడు అరెస్ట్ అయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర, మహిళా కానిస్టేబుల్ రుచిక మధ్య ఏర్పడిన పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో పెళ్లి కోసం ఆమె ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో వివాహితుడైన సురేంద్ర ఆమె అడ్డుతొలగించుకోవాలని భావించి హత్య చేశాడు.
కాగా, ఢిల్లీలోని కాల్ గాల్స్ను ఇతర నగరాలకు తీసుకెళ్లి సురేంద్ర ఎంజాయ్ చేసేవాడు. ఈ క్రమంలో రుచికాకు సంబంధించిన పత్రాలు, వస్తువులను పలు చోట్ల వదిలేవాడు. దీంతో అదృశ్యమైన మహిళా కానిస్టేబుల్ తనుకు తానుగా ఎక్కడికో వెళ్లి ఉంటుందని పోలీసులు భావించారు. తన కుటుంబం వద్దకు తిరిగి వచ్చేందుకు ఆమె ఇష్టపడటం లేదని అనుకున్నారు.
మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ రుచిక మిస్సింగ్పై దర్యాప్తు చేసిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడైన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సురేంద్రను అరెస్ట్ చేశారు. రెండేళ్ల కిందట ఆమెను హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో మృతదేహం పాతిపెట్టిన చోట తవ్వించి అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.