న్యూఢిల్లీ, నవంబర్ 26: గత 11 ఏండ్లలో ఆప్ నాయకులపై 250కిపైగా కేసులు పెట్టారని, ఒక్క కేసులోనూ అవినీతి నిరూపణ కాలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను దెబ్బ తీయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని, ఈ కేసులకు బెదిరిపోయి..అధికార బీజేపీకి లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో మీడియాతో మాట్లాడారు. జైలుపాలైన తమ నాయకులను ఆయన గుర్తు చేసుకున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నందునే ఆప్ను 11ఏండ్లుగా టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఢిల్లీ పోలీసు..ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆప్పై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. 11 ఏండ్లుగా పార్టీ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నదని, అయినా అధైర్యపడకుండా ముందుకు కొనసాగుతున్నామని అన్నారు. తప్పుడు కేసులతో సిసోడియా, సంజయ్సింగ్, సత్యేందర్ జైన్ జైలుపాలు కావటం తననెంతో బాధించిందన్నారు.