న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: మున్సిపల్ కార్పొరేషన్లో నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు కేసును ‘రాజ్యాంగ విరుద్ధం’గా ప్రభావితం చేసేందుకు లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రయత్నించారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ధ్వజమెత్తారు. ఈ కేసులో ఇరు పక్షాల తరఫున తన లాయర్తోనే వాదనలను వినిపించేందుకు ప్రయత్నించి నేరపూరిత కోర్టు ధిక్కరణ (క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్)కు పాల్పడ్డారని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని, లెఫ్ట్నెంట్ గవర్నర్ను ప్రతివాదులుగా చేర్చి ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ దాఖలు చేసిన ఈ కేసులో.. తన తరఫున వాదించేందుకు ఏ లాయర్నైనా ఎంచుకునే హక్కు ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్నదని కేజ్రీవాల్ తెలిపారు. న్యాయవాది గౌతమ్ నారాయణ్ను నియమించాలని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ నెల 9న పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శికి సూచించారని, కానీ.. ఢిల్లీ ప్రభుత్వంతోపాటు తన తరఫున కూడా వాదించేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను రంగంలోకి దింపాలని పట్టణాభివృద్ధి శాఖను లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆదేశించారని కేజ్రీవాల్ వివరించారు.
ఢిల్లీ మేయర్ ఎన్నికపై సస్పెన్స్కు తెరపడింది. గత రెండు నెలల్లో మూడుసార్లు వాయిదా పడిన ఈ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనను ఎల్జీ సక్సేనా శనివారం ఆమోదించారు. నామినేటె డ్ సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీల్లేదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మేయర్ ఎన్నిక నిర్వహించాలని కేజ్రీవాల్ ప్రతిపాదించారు. దీంతో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయించారు. మేయర్ ఎన్నిక ముగిశాక డిప్యూటీ మేయర్ను, ఆరుగురు సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీని కూడా అదే రోజు ఎన్నుకోనున్నారు. నిరుడు డిసెంబర్లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 వార్డులను కైవసం చేసుకొని స్పష్టమైన విజేతగా ఆవిర్భవించింది. బీజేపీ 104 వార్డులతో రెండో స్థానంలో నిలిచింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా మేయర్ ఎన్నిక జరగలేదు. నామినేటెడ్ సభ్యులకు మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుందా? లేదా? అన్న దానిపై ఆప్, బీజేపీ మధ్య వివాదం కొనసాగుతుండటమే కార ణం. దొడ్డిదారిన ఢిల్లీ నగరపాలక సంస్థను కైవ సం చేసుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది.