న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ విషయంలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాటల దాడిని కొనసాగిస్తున్నారు. నకిలీ డిగ్రీ కలిగిన ప్రధాని దేశానికి అవసరం లేదంటూ మోదీని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ‘చదువులో కొంతమంది విద్యార్థులు వెనుకబడితే, వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. తద్వారా అందులోని ఒక విద్యార్థి భవిష్యత్తులో దేశానికి ప్రధాని కావొచ్చు. నకిలీ డిగ్రీతో ఎవ్వరూ దేశ ప్రధాని కావాలని మనం కోరుకోవటం లేదు’ అని శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో పాఠశాల విద్య దారుణంగా ఉన్నదని, ప్రతిఏటా లక్షమంది విద్యార్థులు 9వ తరగతిలో ఫెయిల్ అవుతున్నారని ఓ బీజేపీ నేత చేసిన ఆరోపణలపై కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు.